హైదరాబాద్, మే 29, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయదారులను గుర్తించి పీడీ చట్టం కింద కేసులు పెట్టనున్నట్టు డీజీపీ మహేందర్రెడ్డి హెచ్చరించారు. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టే అంశంపై డీజీపీ శనివారం శాంతిభద్రల అడిషనల్ డీజీ జితేందర్తో కలిసి రేంజ్ ఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల విక్రయాలను ఉక్కుపాదంతో అణచివేయాలని సూచించారు. నకిలీ విత్తనాల వ్యాపారులను గుర్తించి పీడీ చట్టం కేసులు నమోదుచేసి, నకిలీ విత్తనాల బెడదను తప్పించి ఉత్తమ ఫలితాలు సాధించిన పోలీసు అధికారులకు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. ఐదేండ్లుగా నకిలీ విత్తనాలు విక్రయించి అరెస్ట్ అయినవారి వివరాలు, నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు, పంట నష్టం, విక్రయదారుల సమాచారాన్ని సేకరించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. నకిలీ విత్తనాల తయారీదారులు, మార్కెటింగ్, స్థానిక నెట్వర్క్ తదితర వివరాల నిర్వహణ విధానాన్ని (మోడస్ ఆపరెండీ) రూపొందించి కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. నకిలీ విత్తనాల విక్రయదారుల సమాచారాన్ని పోలీసుశాఖకు అందించాలని విత్తన కంపెనీలు, డీలర్లను కోరాలని సూచించారు. ఈ అంశంపై ఏర్పాటుచేసే పోలీస్ నోడల్ అధికారులు తప్పనిసరిగా టాస్క్ఫోర్స్ విభాగం నుంచే ఉండాలని స్పష్టంచేశారు. ముఖ్యంగా ఏవి నకిలీ, ఏవి సరైన విత్తనాలో గుర్తింపులో పోలీసు అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని అన్నారు. ప్రధానంగా పత్తి, మిరప విత్తనాల్లో అధికంగా నకిలీవి ఉంటాయని, రాష్ట్రంలో కొన్నేండ్లుగా నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరించడంతో ఇతర రాష్ర్టాల్లో నకిలీ విత్తనాలను తయారుచేసి ఇక్కడ విక్రయిస్తున్నారని తెలిపారు. సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి వాటిని నిరోధించడంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వీడియోకాన్ఫరెన్స్లో ఐజీలు ప్రభాకర్రావు, నాగిరెడ్డి, రాజేశ్కుమార్ పాల్గొన్నారు.