నల్లగొండ : టీవీల్లో యాంకర్ ఛాన్సులు ఇప్పిస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని, జ్యోతిష్యం పేరుతో మోసాలకు పాల్పడుతున్న కోనాల అచ్చిరెడ్డి అనే వ్యక్తిపై నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వీ. రంగనాధ్ ఆదేశాల మేరకు పోలీససులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. త్రిపురారం ఎస్.ఐ. రామమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. టీవీ చానల్స్లో యాంకర్స్ అవకాశాలు, జ్యోతిష్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న విజయవాడకు చెందిన కోనాల అచ్చిరెడ్డి అనే వ్యక్తిని నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గత చరిత్ర ఆధారంగా అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు చెప్పారు.
తెలుగు రాష్ట్రాలలో ఇతడు చాలామందిని మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మిస్తూ అమాయక ప్రజల నుంచి లక్షల రూపాయలను దండుకుంటున్న ఘరానా మోసగాడి మోసాలకు చెక్ పెట్టినట్లు తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేశాడని నల్లగొండ పట్టణంలోని హనుమాన్నగర్కు చెందిన సమ్మినేని సాయి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పాటు పలు కేసులు అతనిపై ఉన్నట్లుగా గుర్తించి విజయవాడలోని భవానీపురంకు చెందిన కోనాల అచ్చిరెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని తెలిపారు.
మోసపోయానట్లుగా గ్రహించిన బాధితురాలు విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు. నల్లగొండలో జ్యోతిష్యం పేరిట మరో వ్యక్తి దగ్గర 4 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసినట్లు వెల్లడైంది. దీంతో అచ్చిరెడ్డిపై తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కేసులున్నాయన్న దానిపై పూర్తి వివరాలు సేకరించి అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఎస్ఐ రామమూర్తి తెలిపారు. ఇంకా ఎవరైనా ఉద్యోగం, జ్యోతిషం పేరిట అతడి చేతిలో మోసపోయిన వాళ్లు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.