హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): విత్తన చట్టాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని, అప్పుడే నకిలీ విత్తనాల సరఫరాకు అడ్డుకట్ట పడుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. 1966లో రూపొందించిన కేంద్ర విత్తన విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, దీనిపై కేంద్రానికి లేఖ రాస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం హాకా భవన్లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నకిలీ విత్తనాలను ఉపేక్షించబోమన్నారు. పట్టుబడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. దేశంలో నకిలీ విత్తన తయారీదారులపై పీడీ యాక్ట్ పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ప్రధానంగా పత్తి, మిరప విత్తనాలపై దృష్టిపెట్టినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 3,468 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు సీజ్ చేయడంతో పాటు 177 కేసులు నమోదు చేసి 276 మందిని అరెస్టు చేసినట్టు వివరించారు. కార్యక్రమంలో ఐజీ నాగిరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, జేడీలు బాలు, శివప్రసాద్ పాల్గొన్నారు.