హైదరాబాద్, మే 08 (నమస్తే తెలంగాణ): రైతుబీమా తరహాలో ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత అంగ వైకల్యం చెందిన గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆబ్కారీశాఖ అధికారులను మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. శనివారం ఆయన హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఆబ్కారీశాఖపై సమీక్ష నిర్వహించారు.
సీఎం కేసీఆర్ గీత కార్మికులకు ఎక్స్గ్రేషియాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ప్రమాదవశాత్తు చనిపోయిన, శాశ్వత అంగవైకల్యం చెందిన కార్మికుల సమాచారాన్ని 24 గంటల్లో సేకరించి, వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి, రాష్ట్ర ఆబ్కారీశాఖ కమిషనర్కు రిపోర్టు పంపాలని అధికారులకు సూచించారు. ఎక్స్గ్రేషియా బకాయిలను వెంటనే విడుదలచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో నీరాను గీత వృత్తిదారులు (గౌడ కులస్తులు) మాత్రమే ఉత్పత్తి చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమన్నారు. హైదరాబాద్ ట్యాంక్బండ్ వద్ద నిర్మిస్తున్న నీరాకేఫ్ పనుల పురోగతిపై చర్చించారు. నీరాకేఫ్, నందనంలో నీరా, దాని ఉప ఉత్పత్తల తయారీ కేంద్రాల నిర్మాణ పనులు మూడు నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించారు.
ప్రతి జిల్లా కేంద్రంలో ఎక్సైజ్శాఖ నర్సరీలను ఏర్పాటుచేయాలన్నారు. వీటిలో హైబ్రీడ్ తాటి, ఈత, ఖర్జుర, గిరక తాళ్లచెట్లు (డాలర్ ట్రీ) మొక్కలను తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా పెంచాలని చెప్పారు. సొసైటీ సభ్యులకు, టీఎఫ్టీ లైసెన్స్దారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. తాటి, ఈత చెట్లకు నంబర్లు వేసి వాటిని సంరక్షించాలని, అనుమతి లేకుండా వాటిని నరికివారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదుచేయాలని సూచించారు. గీత వృత్తితో సంబంధం లేకుండానే కాంట్రాక్టర్లుగా చెలామణి అవుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్గౌడ్ ఎమ్మెల్యేలు ప్రకాష్గౌడ్, వివేక్, ఆబ్కారీశాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆదనపు కమిషనర్ అజయ్రావు తదితరులు పాల్గొన్నారు.