హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీకి అర్హులైన వారందరూ డీడీలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గతంలో డీడీలు చెల్లించిన వారికి పెరిగిన ధరలు వర్తిస్తాయని తెలిపారు. డీడీలు చెల్లించిన 595 మంది అర్హులకు వారం రోజుల్లో గొర్రెలను పంపిణీ చేస్తామని చెప్పారు. గొర్రెల పంపిణీ, ఇతర అంశాలపై బుధవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గొర్రెల పంపిణీపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పంపిణీ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదుచేయాలన్నారు. జిల్లాల్లో గొర్రెలు, మేకల అమ్మకాలను సులభతరం చేసేందుకు అనువైన ప్రతిచోట ఐదెకరాల్లో గొర్రెల మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు. జీవాల సంఖ్య పెరగడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 7.53 కోట్ల ఖర్చుతో 12 నూతన పశు వైద్యశాలలను నిర్మించినట్టు వెల్లడించారు. సమావేశంలో పశు సంవర్ధకశాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, షీప్ ఫెడరేషన్ ఎండీ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.