హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఔటర్రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల అవతల 348 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.750 కోట్లు ప్రతిపాదించింది. రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు రూ.1,100 కోట్లు, 21 నూతన ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణానికి రూ.400 కోట్లు కేటాయించింది. ఆర్ఆర్ఆర్ను జాతీయ రహదారుల కింద చేపట్టాలన్ని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణలో 50 శాతాన్ని భరించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు భూసేకరణ కోసం ఈ బడ్జెట్లో రూ.750 కోట్లు ప్రతిపాదించింది. ఈ నిధులతో ఉత్తరభాగంలో భూసేకరణను వేగంగా పూర్తి చేయనున్నది. గతేడాది వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రాష్ట్రప్రభుత్వం రూ.1100 కోట్లు కేటాయించింది. వానకాలానికి ముందే గుంతలను పూడ్చి, రోడ్డు కటింగ్ లేకుండా మరమ్మతులు చేయాలని నిర్ణయించింది. ఇందులో రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలోని 2,500 కిలోమీటర్ల రహదారులకు రూ.800 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్లకు రూ.300 కోట్లు ప్రతిపాదించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణలో రోడ్నెట్ వర్క్ బాగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 5,800 కిలోమీటర్ల రహదారులను కొత్తగా నిర్మించారు. రోడ్లు భవనాలశాఖ 360 కిలోమీటర్ల నాలుగు లేన్లు, 7,630 కిలోమీటర్ల డబుల్ లేన్ రోడ్ల నిర్మాణం చేపట్టింది. వీటితోపాటుగా 386 వంతెనలను నిర్మించారు.
రోడ్లు భవనాలశాఖకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.8,788 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో గజ్వేల్ ఇతర కనెక్టివిటీ రోడ్లకు రూ.90 కోట్లు కేటాయింది. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్కు రూ.300 కోట్లు, కోర్ నెట్వర్క్ రోడ్లకు రూ.326 కోట్లు, మేజర్ జిల్లా రోడ్లకు రూ.1,031.65 కోట్లు, ఇతర రహదారులకు రూ.50 కోట్లు, రేడియల్ రోడ్లకు రూ.112.59 కోట్లు, రోడ్ బ్రిడ్జిలకు రూ.188.67 కోట్లు, రూరల్ రోడ్లకు రూ.958.82 కోట్లు ప్రతిపాదించింది.
రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో 32 ఆర్వోబీ, ఆర్యూబీలు మాత్రమే ఉండేవి. రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్తగా 21 ఆర్వోబీ, ఆర్యూబీలను నిర్మించిన సర్కార్.. ఈ ఏడాది మరో 21 కొత్తవాటిని ప్రతిపాదించింది. ఈ మేరకు బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పెద్దపల్లి జిల్లాలో 6, వరంగల్ అర్బన్, ఖమ్మంలో 3, నిజామాబాద్లో 2, జనగామ, మహబూబాబాద్, అదిలాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఒకటి చొప్పున నిర్మాణం చేపడుతారు.
ద్వితీయ శ్రేణినగరాల్లో విమానాశ్రయాల ఏర్పాటుపై చర్యలకు రూ.100 కోట్లు ప్రతిపాదించింది. వరంగల్, అదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్నగర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్నగర్లో పౌర విమానాశ్రయాల ఏర్పాటుపై అధ్యయనం చేసి ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను కోరింది అక్కడి నుంచి రిపోర్టు రాగానే పనులు మొదలుపెడతారు.