ఐజ్వాల్, జూన్ 21: ఒకవైపు దేశంలో జనాభా నియంత్రణకు రాష్ర్టాలు, కేంద్ర ప్రభుత్వం పడరాని పాట్లు పడుతుంటే మిజోరాంకు చెందిన ఒక మంత్రి మాత్రం ఎక్కువ మంది పిల్లల్ని కలిగి ఉన్న కుటుంబ పెద్దకు లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తానని ప్రకటించారు. మిజోరాంలో క్రీడా మంత్రిగా వ్యవహరిస్తున్న రాబర్ట్ రొమవియా ఫాదర్స్ డే సందర్భంగా ఈ ప్రకటన చేశారు. అయితే దీనిని తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఐజ్వాల్ ఈస్ట్-2 అసెంబ్లీ నియోజకవర్గానికే పరిమితం చేశారు. ఆయన మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో ఎక్కువ మంది సంతానం కలిగి ఉన్న తల్లి లేదా తండ్రికి లక్ష రూపాయల నగదు బహుమతి అందిస్తానని ప్రకటించారు. అంతేగాక వారికి ట్రోఫీతో పాటు ఒక ధ్రువీకరణ పత్రాన్ని అందజేయనున్నారు. మిజో తెగలలో నానాటికీ జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో వారిలో జనసంఖ్యను పెంచేందుకే ఈ ప్రకటన చేశానని ఆయన చెప్పుకొచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరాం జనాభా 1,091,014 కాగా, చదరపు కిలోమీటరుకు 52 మంది (దేశ సగటు 382 మంది) మాత్రమే ఉన్నారు.