ఉండవెల్లి/నల్లగొండ మే 14: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ సోకిన వ్యక్తులను బెడ్ కన్ఫర్మ్ కాకుండానే అంబులెన్సుల్లో హైదరాబాద్కు తరలిస్తుండటంతో తెలంగాణ సరిహద్దు జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్గేట్ వద్ద శుక్రవారం అధికారులు వాటిని నిలిపివేశారు. హైదరాబాద్ దవాఖానల్లో కరోనా రోగుల తాకిడి పెరగడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, అక్కడికి వెళ్లి ఇబ్బందులకు గురికావొద్దని బాధితులకు తెలియజెప్పారు. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యక్తులు కరోనాతో బాధపడుతున్న వారికి అనుమతి ఇవ్వకపోవడంతో అంబులెన్స్లోనే మరణిస్తున్నారని సోషల్మీడియాలో దుష్ప్రచారానికి పూనుకున్నారు. కొందరు ఏపీ వాసులు పుల్లూరు టోల్గేట్ వద్దకు చేరుకుని లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న భద్రతాసిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఏపీ బీజేపీ నాయకులు ఒక్కరిసారిగా టోల్గేట్కు చేరుకుని అంబులెన్స్లను ఎలా అడ్డుకుంటారని హల్చల్ చేశారు. రోడ్డుపై ధర్నా చేసేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కలగజేసుకుని తెలంగాణ సరిహద్దులో ధర్నాలకు అనుమతుల్లేవని, ఏపీ సరిహద్దులో ధర్నా చేసుకోవాలని అందోళనకారులకు చెప్పి కర్నూలుకు పంపించారు. జోగుళాంబ గద్వాల ఎస్పీ రంజన్ రతన్కుమార్ పరిస్థితులను పర్యవేక్షించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సరిహద్దు చెక్ పోస్టుల వద్ద కూడా ఇదేవిధమైన పరిస్థితి ఏర్పడింది. నాగార్జునసాగర్ పరిధిలోని కొత్త బ్రిడ్జితోపాటు నార్కట్పల్లి-అద్దంకి రహదారిపై వాడపల్లి వద్ద వాహనాలను తనిఖీ చేసి అనుమతి పత్రాలున్నవాటినే తెలంగాణలోకి అనుమతించారు. కొవిడ్కు కాకుండా ఇతర చికిత్సల కోసం వెళ్తున్న వారిని మాత్రం అడ్డుకోలేదు. వాడపల్లి వద్ద నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ పరిస్థితిని సమీక్షించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని రామాపురం చెక్పోస్టు వద్ద కూడా అనుమతిలేని కరోనా పేషెంట్ల అంబులెన్స్లను ఆపేశారు.