హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న కారణంగా శుక్రవారం నుంచి అన్ని పాస్పోర్ట్ సేవాకేంద్రాలు, లఘుకేంద్రాలు, 14 పోస్టాఫీస్ సేవాకేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో కరోనా దృష్ట్యా సేవలు కుదించడంతో దరఖాస్తుదారులకు అపాయింట్మెంట్ లభించేందుకు 7 నుంచి 12 రోజులు పట్టేదని, దీనిపై తమకు దరఖాస్తుదారుల నుంచి విజ్ఞప్తులు అందాయని చెప్పారు. వందశాతం సేవలతో ఇకనుంచి అపాయింట్మెంట్ రెండుమూడు రోజుల్లో లభించనున్నదని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రీజినల్ పాస్పోర్ట్ ఆఫీస్లో పబ్లిక్ ఎంక్వైరీ కౌంటర్ సేవలు ఉదయం 9:30నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు.