తొలి దశలో 82 రైల్ సర్వీసుల పునరుద్ధరణ
దమరే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు 16 నెలల క్రితం నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లు సోమవారం నుంచి మళ్లీ పరుగులు తీయనున్నాయి. దాదాపు 82 సర్వీసులతో ప్యాసింజర్ రైళ్లను పునఃప్రారంభించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య శనివారం తెలిపారు. దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో గత ఏడాది మార్చి నెలలో రైళ్ల రాకపోకలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత క్రమంగా ఎక్స్ప్రెస్ రైళ్లను పునరుద్ధరించారు. కానీ ప్యాసింజర్ రైళ్లు (అన్రిజర్వుడ్) మాత్రం పట్టాలెక్కలేదు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు 95శాతం ఎక్స్ప్రెస్ రైళ్లను ఇప్పటికే పునరుద్ధరించారు. ఈ నెల 19 నుంచి 82 ప్యాసింజర్ రైళ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గత ఏడాది లాక్డౌన్కు ముందు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 256 రైలు సర్వీసులను నిర్వహించారు. ఇప్పుడు 82 సర్వీసులను పునరుద్ధరిస్తున్నామని, త్వరలోనే మిగిలిన వాటిపై స్పష్టత ఇస్తామని మాల్య పేర్కొన్నారు. ఈ రైళ్లలో ప్రయాణించేవారు స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్లతోపాటు యూటీఎస్ యాప్ (ఆన్లైన్), ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు (ఏటీవీఎం), కాయిన్ టికెట్ వెండింగ్ మెషిన్లు (సీవోటీఎం)ల ద్వారా టికెట్లు పొందవచ్చని వివరించారు. ప్యాసింజర్ రైలులో ప్రతిరోజు ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు సీజనల్ టికెట్లు కూడా పొందే సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామన్నారు. జంటనగరాలలో ఎంఎంటీఎస్ రైళ్లు ప్రతిరోజు 121 సర్వీసులు తిరగాల్సి ఉండగా, ప్రస్తుతం 55 సర్వీసులను మాత్రమే తిప్పుతున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మిగిలిన సర్వీసులను కూడా త్వరలోనే పునరుద్ధరిస్తామని గజానన్ మాల్య చెప్పారు.