హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఫస్టియర్ వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి చెప్పారు. వీరిని పరీక్షల్లేకుండా పాస్చేసే ఆలోచనేదీ లేదని, విద్యార్థులంతా పరీక్షలు రాయాల్సిందేనని స్పష్టంచేశారు. గన్ఫౌండ్రీలోని తన కార్యాలయంలో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలను నిర్వహించనున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన తర్వాత పరిస్థితిని సమీక్షించి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేస్తామని వెల్లడించారు. గత మే నెలలోనే ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగాల్సి ఉండగా.. కరోనా వ్యాప్తి కారణంగా వాటిని వాయిదా వేసి విద్యార్థులందరినీ (4.35 లక్షల మంది) పైతరగతులకు ప్రమోట్చేశారు.
తాజాగా పరిస్థితులు కుదుటపడటంతో ప్రస్తుతం సెకండియర్లోని విద్యార్థులందరికీ ఫస్టియర్ వార్షిక పరీక్షలను నిర్వహించాలనుకుంటున్నట్టు మంత్రి వెల్లడించారు. గతంలో సెకండియర్ విద్యార్థులను ఫస్టియర్ మార్కుల ఆధారంగా పాస్చేశామని, మళ్లీ కరోనా విజృంభిస్తే, సెకండియర్వారిని పాస్చేసేందుకు ఫస్టియర్ మార్కులేవీ ఉండవు కనుక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు గతంలోనే పరీక్ష ఫీజులు చెల్లించడంతో ఇప్పుడు ఎలాంటి ఫీజులు వసూలుచేయబోమని చెప్పారు. పరీక్షలకు కేంద్రాలు సహా ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలను సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులకు తగిన సమయం ఇస్తామని తెలిపారు.
పాఠశాలల ప్రారంభంపై నేడు సమీక్ష
పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో స్కూళ్ల సన్నద్ధతపై మంత్రి సబితాఇంద్రారెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. డీఈవోలు, విద్యాశాఖ అధికారులతో వర్చువల్గా సమావేశం కానున్నారు. జిల్లాలవారీగా ఏర్పాట్లపై మంత్రి ఆరా తీయనున్నారు.