మంచాల, జూలై 11 : పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధికి బాటలు పడ్డాయని, పల్లెప్రగతి నిరంతర ప్రక్రియని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలం పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ నర్మద అధ్యక్షతన పల్లెప్రగతి ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా వివిధ గ్రామాల్లో పల్లెప్రగతి ప్రతిభ చూపిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు, కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు, సర్పంచ్లను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శాలువా పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని అభినందించారు. ఇదే స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మండలంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ. 5.50 కోట్ల కేటాయించామని, అందులో ఆగపల్లి- నోముల రోడ్డుకు రూ.3కోట్లు, బుగ్గతండా- ఎల్లమ్మతండా రోడ్డు వరకు రూ.2.50 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నిత్య, వైస్ ఎంపీపీ రాజేశ్వరి, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఈవోఆర్డీ మధుసూదనాచారి, ఏఈ అబ్బాస్, పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఇంటింటికీ ఆరు మొక్కలు నాటాలి
హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ ఇంటింటికీ ఆరు మొక్కలు నాటాలని మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి అన్నారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..హరితహారం మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ యాదగిరి, కమిషనర్ జయంత్కుమార్రెడ్డి పాల్గొన్నారు.
ఇంటింటికీ మొక్కలు అందజేత
మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో ఆదివారం కౌన్సిలర్ అనుపమసుప్రసేనారెడ్డి ఇంటింటికీ మొక్కలు అందజేశారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా చేపడుతామని స్పష్టం చేశారు. ఇందుకు ప్రజలు సహకరించాలన్నారు.