హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 21: బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున హుజూరాబాద్ పట్టణంలోని తెలుగువాడ, పోచమ్మకాలనీ, రజకవాడ, కిందివాడలో గురువారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ క్రమంలో కొందరు మహిళలు వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ తమ ఇంటి ఎదుట ఖాళీ సిలిండర్లు ప్రదర్శించారు. పెరిగిన సిలిండర్ల ధరలను తగ్గించి ఓటు అడగాలని కోరుతుండగా జమున వారిని పట్టించుకోలేదు. రోజురోజుకూ పెరుగుతున్న గ్యాస్ ధరలతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్తుండటంతో జమున వినీ విననట్టుగా, తమ ఇంట్లో ఓటు అడగకుండానే ఇల్లు దాటవేసి వెళ్లిపోయారని పలువురు మహిళలు తెలిపారు. ఒక్కసారిగా నిరసన తెలుపుతుండటంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు వెంటనే జాగ్రత్త పడి జమునను వాహనంలో ఎకించుకొని అక్కడి నుంచి తీసుకెళ్లారు.