హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం గడువులోగా పూర్తికావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆదేశించారు. జిల్లా పార్టీ అధ్యక్షులను పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయిస్తారన్నారు. బుధవారంలోగా గ్రామ వార్డు కమిటీలు, 20 లోపు మండల, పట్టణ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాల్సిందేనని స్పష్టంచేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణ పురోగతిపై సోమవారం పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, ఇతర ప్రధాన కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శులు ఇంచార్జిలుగా ఉన్న నియోజకవర్గాలలో రెండు వారాలుగా సాగుతున్న పార్టీ సంస్థాగత నిర్మాణం పురోగతి వివరాలు తెలుసుకొన్నారు. గ్రామ, వార్డు కమిటీల నియామకం ఇప్పటికే దాదాపు 80 శాతానికి పైగా పూర్తయిందని, మిగతా 20 శాతం కూడా రెండ్రోజుల్లో పూర్తిచేస్తామని ప్రధాన కార్యదర్శులు వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 15వ తేదీ నాటికి గ్రామ, వార్డు కమిటీల నిర్మాణం వివరాలను పార్టీ కేంద్రకార్యాలయానికి సమర్పించాలని కేటీఆర్ ఆదేశించారు. ఈ నెల 20 నాటికి మండల, పట్టణ కమిటీలు, అనుబంధ కమిటీలు కూడా పూర్తి కావాలని ఆదేశించారు. పార్టీ నియమావళిని అనుసరించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు అన్ని స్థాయిల్లో ప్రాధాన్యమిస్తున్నామని ప్రధాన కార్యదర్శులు తెలియజేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే మహిళా కార్యకర్తలకు పార్టీ కమిటీల కూర్పులో ప్రాధాన్యమివ్వాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
జిల్లా కమిటీలపై అధినేత దృష్టి
పార్టీ అధినేత కేసీఆరే జిల్లా కమిటీలపై దృష్టి సారించారని, మండల కమిటీల నియామకం పూర్తయిన వెంటనే జిల్లా కమిటీలను ఆయనే ప్రకటిస్తారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తయిన తర్వాత జిల్లా కమిటీల ఏర్పాటుపై జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని జిల్లా కమిటీల నిర్మాణం పూర్తిచేస్తామని పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రజాప్రతినిధులతో పాటు సీనియర్ నాయకులు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత సంపూర్ణ గణాంకాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి నిర్దేశిత గడువులోగా అందజేయాలని ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. ఇదే అంశంపై వారంలో మరోసారి సమీక్ష ఉంటుందని తెలిపారు.