జిల్లాలో త్వరలో ప్రారంభం కానున్న శిక్షణ కేంద్రం
ఏర్పాట్లు పూర్తి చేసిన ఆర్టీసీ అధికారులు
డ్రైవింగ్కు దరఖాస్తుల ఆహ్వానం..45 రోజుల శిక్షణ
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 10 : ఆర్టీసీ సంస్థ రోజురోజుకూ నూతన సంస్కరణలతో ముందుకెళ్తున్నది. నిత్యం ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీ సంస్థను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో సంస్థకు కోట్లాది రూపాయల నష్టంతో కొనసాగింది. తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీపై ప్రత్యేక దృష్టి సారించింది. బడ్జెట్లో నిధులను గతంలో కన్న అధికంగా కేటాయించడంతో పాటు, నూతన సంస్కరణలు చేపట్టింది. ఇందులో ఇటీవల ఆర్టీసీ కార్గో పార్సిల్ కొరియర్ సర్వీను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఒకే బస్సులో ప్రయాణికులతో పాటు కొరియర్ పార్సిళ్లు, వస్తువులను తీసుకెళ్లడంతో క్రమ క్రమంగా నష్టాల నుంచి ఆర్టీసీ గట్టెక్కుతున్నది. కార్గో పార్సిల్ సేవలతో పాటుగా అదనంగా బస్సు డ్రైవింగ్లో శిక్షణకు శ్రీకారం చుట్టింది. దీంతో ఈ సంస్థ ద్వారా నైపుణ్యం గల డ్రైవర్లుగా కార్మికులను తీర్చిదిద్దడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నది.
త్వరలో ప్రారంభం కానున్న డ్రైవింగ్ శిక్షణ కేంద్రం
నిర్మల్ జిల్లా కేంద్రంలో త్వరలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ శిక్షణ కేంద్రం ప్రారంభం కానుంది. ఈ నెల 15న జిల్లా కేంద్రంలోని బస్ డిపో ప్రాంగణంలో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇందుకు బస్సును కేటాయించారు. శిక్షణ అందించేందుకు 30 సంవత్సరాల అనుభవం కలిగిన డ్రైవర్లను సైతం ఎంపిక చేశారు.
డ్రైవింగ్కు దరఖాస్తుల ఆహ్వానం..
డ్రైవింగ్లో శిక్షణకు ఔత్సాహికుల కోసం దరఖాస్తు చేసుకోవాలని డిపో మేనేజర్ ఆంజనేయులు ప్రకటనను విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న వారు లర్నింగ్ లైసెన్సు ఉండి 2 ఏళ్ల అనుభవం ఉన్నవారు రూ.15000 రుసుము కట్టి, డ్రైవింగ్పై శిక్షణ ఇవ్వనున్నారు. 45 రోజుల పాటు అందించే శిక్షణలో డ్రైవింగ్పై మెలకువలతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై సైతం అవగాహన కల్పించనున్నారు. థియరీ క్లాసుల్లో ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు నిబంధనలు, వాహనాల వేగం పరిమితి, వాహనాలను నిలిపై పద్ధతి, ప్రార్థన మందిరాల్లో, ఇతర సున్నిత ప్రదేశాల్లో సైరన్లపై అవగాహన కల్పించనున్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రాథమికంగా తీసుకోవాల్సిన చర్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్ ఎలాంటి నిబంధనలు పాటించాలనే అంశాలతో పాటు థియరీ క్లాసులను నిర్వహించనున్నారు.
ఉత్సాహం చూపుతున్న ఔత్సాహికులు
జిల్లాలో శిక్షణ ఇచ్చేందుకు ఇలాంటి శిక్షణ సంస్థలు లేకపోవడంతో డ్రైవింగ్పై మక్కువ ఉన్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకుంటున్నారు. పైగా పెద్ద మొత్తంలో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఉండడంతో వెనుకడుగు వేస్తున్నారు. ఒకవేళా శిక్షణకు వెళ్లిన కేవలం డ్రైవింగ్ వంటి శిక్షణను మాత్రమే ఇవ్వడం థియరీ క్లాసులు నిర్వహించకపోవడంతో ట్రాఫిక్ రూల్స్ తెలియక పోవడంతో జరిమానాలతో పాటు, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. శిక్షణ అనంతనం ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వక పోవడంతో ప్రయోజనం ఉండడం లేదు. కాని ఆర్టీసీలో శిక్షణ పొందిన డ్రైవర్లకు శిక్షణ అనంతరం సర్టిఫికెట్ ఇవ్వడంతో భవిష్యత్లో ఆర్టీసీ సంస్థలో భర్తీ అయ్యే డ్రైవర్ పోస్టులకు వెయిటేజీని కల్పించనున్నారు. డ్రైవింగ్ లైసెన్సు సైతం త్వరలో వచ్చే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
అంబులెన్స్ను ప్రారంభించిన మంత్రి కొప్పుల