ఆటా ప్రతినిధులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపు
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కరోనా వ్యాధి నిర్మూలనకు రాష్ట్రప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఈ కృషిలో ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ప్రతినిధులు తగిన సహకారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ఆటా ప్రతినిధులతోపాటు, కలెక్టర్లు, సైబరాబాద్ సీపీ, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజారోగ్యానికి రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. వరంగల్లోని ఎంజీఎంతోపాటు ఇతర దవాఖానలకు ఆక్సిజన్ ఫ్లోమీటర్లు, కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, కన్జ్యూమబుల్స్, రెగ్యులేటర్లు, తదితర పరికరాలను విరాళంగా అందించేందుకు ఆటా ప్రతినిధులు ముందుకురావాలని కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి తమవంతు సహాయ, సహకారాలు అందజేస్తామని ఆటా అధ్యక్షుడు భువనేశ్, జాయింట్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి, ఆటా బాధ్యులు కొత్త కాశిరెడ్డి, అనిల్ పొశెట్టి, శారద సింగిశెట్టి, సుధీర్ బండారు, మురళీ బొమ్మినేని, హనుమంతరెడ్డి, శివకుమార్, రవి, తిరుపతి, లోహిత్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్, వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, జనగామ కలెక్టర్ నిఖిల, నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్, మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతమ్, నారాయణపేట కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు.