వరంగల్ అర్బన్: బీజేపీలో చేరిన మరుక్షణమే ఈటల రాజేందర్ పతనం ప్రారంభమైందయిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిన ఈటల.. ఆత్మగౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కమలాపూర్ మండలంలోని ఉప్పల్లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్యెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈటల వంటివారు వెయ్యి మంది వచ్చినా టీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరని తెలిపారు.
తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్న బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ నియోజకవర్గ ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ఆదరించకుంటే మాజీ మంత్రి అడ్రస్ ఎక్కడడుండేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో లేని ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు. కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలను ఆపలేదని వెల్లడించారు.