ముంబై ,మే 12: నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా పతనమైంది. ఆ తర్వాత కాస్త తేరుకున్నప్పటికీ భారీ నష్టాల్లోనే ఉన్నాయి. కమొడిటీ ధరలు దూసుకెళ్తుండటంతో ద్రవ్యోల్బణ భయాలుపెరిగి అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి.
అక్కడి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు ద్రవ్యోల్బణ భయం, కమొడిటీ ధరల పెరుగుదల నేపథ్యంలో కీలక వడ్డీరేట్లు, బాండ్స్ రాబడి పెరగవచ్చనే అంచనాలతో అప్రమత్తంగా కదులుతున్నాయి. వీటికి తోడు కీలక రంగాల్లో అమ్మకాలు, కొవిడ్ భయాలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి. కరోనా నేపథ్యంలో తైవాన్ సూచీలు నాలుగు శాతం మేర నష్టపోయాయి.