హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ సిటీ మినీ పల్లెవెలుగు బస్సు సక్సెస్ అయ్యింది. ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన సిటీ మినీ బస్సు సత్ఫలితాలిస్తున్నది. ప్రధాన రహదారి మొదలు.. కాలనీలకూ రైట్ రైట్ చెప్పడంతో లాభాలు తెచ్చిపెడుతున్నది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాలతో ఖమ్మం పట్టణంలో 10 సిటీ మినీ పల్లెవెలుగు బస్సులను అందుబాటులోకి తెచ్చారు. పట్టణంలో మొదటి స్టాప్ నుంచి చివరి స్టాప్ వరకు ఎక్కడికైనా కేవలం రూ.10 చార్జి చేస్తున్నారు. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుండటంతో ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఫలితంగా బస్సులతో సంస్థకు రోజుకు రూ.లక్ష వరకు ఆదాయం సమకూరుతున్నది. మినీ బస్సులో డ్రైవర్ మాత్రమే ఉంటారు. పెద్ద బస్సులతో పోలిస్తే రెండు కిలోమీటర్ల మేర అదనపు మైలేజీ ఉండటం కలిసొచ్చే అంశమని ఆర్టీసీ అధికారులు తెలిపారు. చిన్న బస్సులు కావడంతో మెయిన్రోడ్డుతోపాటు ముఖ్యమైన కాలనీలు, వీధులకు సైతం నడుపుతున్నారు. ప్రయాణికులు ఆసక్తి చూపడం.. వరుసగా ట్రిప్పులు వేస్తుండటంతో బస్సుల అందుబాటు పెరిగి ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతున్నదని తెలిపారు. మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకు మరో పది బస్సులను అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ పట్టణంలో ప్రస్తుతం సిటీ బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ.. అవన్నీ పెద్ద బస్సులే. స్థానికంగా అన్ని కాలనీలకు చేరేలా మినీ బస్సులు తెస్తే ప్రయాణికులకు సదుపాయం, సంస్థకు ఆదాయం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఐటీ విస్తరిస్తున్న ద్వితీయ శ్రేణి పట్టణాలకు సైతం సిటీ మినీ బస్సులు అందుబాటులోకి తెస్తే ప్రయోజనకరంగా ఉంటుందని యోచిస్తున్నారు. ఇప్పటికే కార్గో సేవలతో ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువైంది.
మంచి స్పందన
ఖమ్మం పట్టణ ప్రజలకు సిటీ మినీ పల్లెవెలుగు బస్సులు అందుబాటులోకి తెచ్చాం. స్థానికంగా రూ.10 చార్జితోనే ఏ స్టాప్ వరకైనా ప్రయాణించే సదుపాయం కల్పించాం. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. మినీ బస్సులతో సంస్థకు ఆదాయం పెరిగింది. రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు ఈ సిటీ మినీ బస్సులు విస్తరించే అంశాన్ని పరిశీలిస్తాం.
పువ్వాడ అజయ్కుమార్, రవాణాశాఖ మంత్రి