హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పది రోజులపాటు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాల నిర్మాణం పది రోజుల్లో పూర్తి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను ఆయన ఆదేశించారు. గడువులోగా నిర్మాణం పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు రాత్రి బస చేసి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఖాళీ స్థలాల పరిశుభ్రతపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. తొలుత యజమానికి నోటీసులు ఇవ్వాలని, స్పందించకపోతే స్థలాన్ని పంచాయతీ స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.