గద్వాల న్యూటౌన్, సెప్టెంబర్ 27: ఆడపిల్లలకు జన్మనివ్వడమే ఆ తల్లికి శాపమైంది. ముగ్గురూ అమ్మాయిలు పుట్టారన్న కోపంతో ఓ వ్యక్తి భార్యను గొంతునులిమి చంపిన దారుణ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్నది. బంధువులు, పోలీసుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా మదనపురానికి చెందిన అన్నపూర్ణ అలియాస్ పల్లవి (26)కి రెండేండ్ల కిందట గద్వాలకు చెందిన వెంకటేశ్తో వివాహమైంది. వీరికి గతేడాది పాప పుట్టింది. ఈ నెల 24న రెండో కాన్పులో మళ్లీ ఆడ కవలలకు జన్మనిచ్చింది. ముగ్గురూ ఆడపిల్లలే కావడంతో వెంకటేశ్ భార్యపై కోపం పెంచుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రిస్తున్న పల్లవి గొంతు నులిమాడు. పల్లవి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. ఆమెకు ఫిట్స్ వచ్చిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. స్ధానికులు బాధితురాలిని ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, హత్య నుంచి తప్పించుకునేందుకు వెంకటేశ్ హైడ్రామా ఆడాడు. అతని వాలకం అనుమానస్పదంగా ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టంలో పల్లవి గొంతుపై నులిమినట్టు తేలడంతో గద్వాల సీఐ షేక్ మహబూబ్బాషా పల్లవిది హత్యగా నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు వెంకటేశ్, అతని తల్లి జయమ్మ, జనార్దన్, లీలవతిపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.