వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచార నిందితుడు పల్లకొండ రాజు స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్పై ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ప్రత్యక్ష సాక్షి, రైల్వే సిబ్బంది కుమార్ కథనం ప్రకారం.. స్టేషన్ ఘన్పూర్ రాజారాం బ్రిడ్జి నంబర్ 436 వద్ద ఓ వ్యక్తి గురువారం ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు రైల్వే సిబ్బంది సారంగపాణి చెప్పాడు. మమ్మల్ని చూసి రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి అతను వెళ్లాడు. పది నిమిషాలు అయిన రాకపోయేసరికి మేం 200 మీటర్లు ముందుకెళ్లాం.
ఉదయం 8:40 గంటలకు హైదరాబాద్ వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్కు ఎదురుగా వెళ్లి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన సమీప రైతులు మాకు సమాచారం అందించారు. మేము అక్కడికి వెళ్లి డెడ్బాడీని చూసి రైల్వే అధికారులకు సమాచారం అందించాం. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని చూస్తే సైదాబాద్ నిందితుడు రాజు అని తెలిసిపోయింది. సారంగపాణి 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చాడు. అంతలోపే పోలీసులు రాజారాం బ్రిడ్జి వద్దకు చేరుకున్నట్లు కుమార్ తెలిపాడు.