కరీంనగర్ : రెమ్డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని నలుగురు ఉద్యోగులు రెమ్డెసివిర్ ఇంజక్షన్లను పక్కదారి పట్టించి విక్రయిస్తుండగా కిసాన్నగర్లోని ప్రవిస్తా అపార్ట్మెంట్పై రైడ్ చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను సైదాపూర్కు చెందిన ఎల్. అంజనీ కుమార్, కొత్తపల్లికి చెందిన చోపారి గోపీచంద్, చొప్పదండికి చెందిన గజ్జేల శ్యామ్ కుమార్, కరీంనగర్లోని సవారన్ వీధికి చెందిన గంటాలా ఉగేందర్గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న నిందితులు తమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి ఇవ్వాల్సిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను పక్కదారి పట్టించి విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు అపార్ట్మెంట్పై రైడ్ చేసి నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఏడు రెమ్డెసివర్ ఇంజెక్షన్లు, రూ .4,530 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.