జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రంలోని పీజీ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ లక్ష్మీకాంత్ రాథోడ్ అన్నారు. మంగళవారం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి నది అగ్రహారం దగ్గర ఉన్న పీజీ కళాశాలను వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి పీజీ కళాశాలలో ఎంబీఏ కోర్సును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన వసతి గృహాలను వచ్చే నెలలో ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామన్నారు. కళాశాలలో ఎంబీఏ కోర్సుతో పాటు ఎమ్మెస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ కోర్సుల ప్రారంభానికి కృషి చేస్తానని తెలిపారు. కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం అని వీసీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక చైర్మన్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు.