ఆత్మకూరు టు అమెరికా
నిరుపేద కుటుంబం నుంచి..
ఉన్నత చదువులకు యూఎస్ఏకు పయనం
ఆత్మకూరు, ఆగస్టు 1 : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని మారుమూల గ్రామం మూలమల్ల. గ్రామానికి చెందిన దళిత కుటుంబం చిన్నపాగ దాసు, తిరుపతమ్మల ఏకైక కూతురు చిన్నపాగ ప్రీతి. వీరికి తెలిసిందల్లా వ్యవసాయం, బీడీలు చుట్టడం.. ఇవే పనులతో ఉన్న ఒక్క కూతురును ఉన్నతంగా చదివించాలనుకున్నారు. చిన్నప్పుడు ఆత్మకూరులోని ఎస్వీఎస్ పాఠశాలలో ప్రీస్కూల్ విద్యనభ్యసించగా అప్పుడే ప్రీతి తెలివి తేటలను గుర్తించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అడ్మిషన్కు పంపించారు. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు హైదరాబాద్ రామాంతపూర్లోని పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేసింది.
ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన (టీఎస్డబ్లూర్డీసీ) గురుకుల డిగ్రీ కళాశాల ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించి సీటు సంపాదించింది. మహీంద్రహిల్స్లోని డిగ్రీ గురుకుల కళాశాలలో బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్, డైటాటిక్స్ మొదటి సంవత్సరం పూర్తిచేసింది. ఈ దశలోనే గురుకులం నిర్వాహకులు అమెరికా కాన్సులేట్ నిర్వహించే పలు ఎంపిక పరీక్షలకు విద్యార్థులను ప్రోత్సహించారు.
వారు నిర్వహించిన ఎంపిక పరీక్షల్లో అ ర్హత సాధించిన ప్రీతికి అమెరికాలోని వి శ్వవిద్యాలయంలో ఉచితంగా విద్యనభ్యసించే అవకాశం దక్కింది. దేశ వ్యాప్తం గా 20 మంది పరీక్ష రాయగా రాష్ట్రం నుంచి ముగ్గురు మాత్రమే ఎంపిక కా వడం.. అందులో వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామం విద్యార్థిని ఎంపికవ్వడంతో జిల్లా పేరు మరోమారు ఖ్యాతి గడించింది. తల్లిదండ్రుల దీన స్థితిని గుర్తించిన ‘ప్రీతి’ తనకు ప్రీతిపదమైన చదువుతోనే వారి కష్టాలను తీర్చాలనుకున్నది. చిన్ననాటి నుంచి కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుతూ డిగ్రీ వరకు చదివింది. తెలంగాణ స ర్కారు ప్రవేశపెట్టిన గురుకుల డిగ్రీ కళాశాల నుంచి అమెరికా అందించే కమ్యునిటీ కాలేజ్ ఇన్షియేట్ ప్రోగ్రాం ఫెలోషిప్కు అర్హత సాధించింది. అమెరికా ఓహియోలోని సింక్లెయిర్ కమ్యూనిటీ కాలేజీలో సంవత్సరం పాటు అగ్రికల్చర్ కోర్సుకు ఎంపికైంది.
అక్కడ విద్యనభ్యసిస్తూ సంవత్సర కాలంలో వారు నిర్వహించే అర్హత పరీక్షల్లో విజయం సాధిస్తే ఇక ప్రీతి కల నెరవేరినట్లే. భవిష్యత్లో ఉన్నతమైన ఉద్యో గం, జీవితంతోపాటు తల్లిదండ్రుల తలరాతను మార్చినట్టే.. ఆదివారం అర్ధరా త్రి అమెరికాకు బయలుదేరిన ప్రీతి ఆశ లు నెరవేరాలని, ఆమె తల్లిదండ్రుల కల లు నిజం కావాలని మండలవాసులు కాంక్షిస్తున్నారు.