మహబూబ్నగర్ : సమైక్య రాష్ట్రంలో వానలు లేక బోర్లు, బావులు ఎండిపోయి పంటలు పండక గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయ్యేవి. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బంగారు పంటలు పండే పరిస్థితి వచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నిర్మాణంలో ఉన్న పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే పాలమూరు కోన సీమను తలపిస్తుందన్నారు. మంగళవారం దేవరకద్ర మండలం చిన్న రాజమూరు వద్ద కోయిల్ సాగర్ వాగుపై రూ. 5కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యాంను ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో బోర్లు, బావులు ఎండిపోవడంతో పాటు సాగునీటి అవకాశాలే ఉండేవి కాదన్నారు. వర్షాలు పడి వాగులు వంకలు పొంగితే అవన్నీ కృష్ణానదిలో కలిసిపోయేవి తప్ప రైతులకు ఉపయోగపడే పరిస్థితే లేదన్నారు. మేజర్, మైనర్ అనే తేడా లేకుండా ఇరిగేషన్ వ్యవస్థనే సమైక్య పాలకులు నాశనం చేశారని గుర్తు చేశారు. పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఉమ్మడి జిల్లాకు సాగునీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అవుతుదన్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ బాగుపడుతుండగా గతలంలో నీళ్లు, కరెంటు ఇవ్వని వాళ్లు మళ్లీ మోపవుతున్నారని విమర్శించారు. కోయిల్ సాగర్ వాగు, ఊకచెట్టు వాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యాంల వల్ల వాగులు సజీవంగా కనిపించే నదుల్లా మారుతున్నాయని.. గత పాలకులకు ఈ ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
తెలంగాణ రాక పూర్వం రైతులు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని, ఇప్పుడు రైతు కళ్లల్లో ఆనందం ఉందని అన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా పంటలు కనపడుతున్నాయని, దారిపొడవునా పచ్చని పొలాలతో మార్కెట్లనిండా ధాన్యం రాసులతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు.
ఇప్పుడు రైతులు బతకడానికి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
72 టీఎంసీలకు చేరిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్
కరోనాతో చనిపోయింది 4 లక్షలు కాదు.. 40 లక్షల మంది!
భారీగా పతనమైన అదానీ షేర్స్…కారణం ఇదే..!
రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన