సిద్దిపేట,ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను సాధించింది. ఉద్యమాన్ని కొనసాగించిన ఉద్యమనేతకే పాలనపగ్గాలను తెలంగాణ ప్రజానీకం అందజేసింది. సిద్దిపేట బిడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు బాధ్యతలు చేట్టారు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు భిన్నంగా పాలన కొనసాగిస్తుండడంతో యావత్తు తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన సమయంలో నానా రకాలుగా మాట్లాడిన వారి నోళ్లను మూయించి, ఇవాళ టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. పార్టీ ఆవిర్భవించి నేటితో 20 ఏండ్లు. 2001 ఏప్రిల్ 27 టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ ప్రారంభించిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఎన్నో ఉద్యమాలను చేసింది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. సీమాంధ్ర పాలకుల చేతిలో దగా పడుతున్న తెలంగాణ సమాజాన్ని తట్టి లేపింది. టీఆర్ఎస్ పార్టీకి పుట్టినిల్లుగా ఉమ్మడి మెదక్ జిల్లా చరిత్రలో నిలిచిపోయింది. సిద్దిపేటరూరల్ మండలం చింతమడక గ్రామంలో పుట్టిన కేసీఆర్, ఇవాళ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. మంత్రి హరీశ్రావు ఉద్యమంలో తనదైన పాత్రను పోషించి పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు.
ఉద్యమ ఘట్టాల్లో కొన్ని..
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటు పోట్లను ఎదుర్కొంది. అయినా ఉద్యమ ఉధృతిని ఏ మాత్రం తగ్గకుండా ముందుకు తీసుకెళ్లింది. రాష్ర్టాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. నాడు ఉద్యమాన్ని నడిపించిన నాయకుడే.. నేడు పాలన పగ్గాలు చేతబట్టారు. తొలుత 2001లో పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు టీఆర్ఎస్పై అవాకులు, చెవాకులు పేల్చారు. మూడొద్దులకే పార్టీ మూసుకపోతున్నదని ఎన్నో రకాలుగా హేళన చేసే మాటలు మాట్లాడారు. అయినా ఎక్కడా కూడా కేసీఆర్ వెనుకడుగు వేయకుండా ఉద్యమ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. 2005లో వరంగల్లో నిర్వహించిన జైత్రయాత్ర సభకు కేసీఆర్ సైకిల్పై బయలుదేరి వెళ్లారు. సిద్దిపేట నుంచి వరంగల్ బహిరంగ సభ వరకు ఆయన వెంట సైకిళ్లపై వందల మంది కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. 2006లో తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పడంతో ఆ పార్టీపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. సిద్దిపేటలో శంఖారావం పేరిట బహిరంగ సభ నిర్వహించగా, వివిధ ప్రాంతాల నుంచి లక్షల్లో ప్రజలు హాజరై సభకు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు.
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి ఎమ్మెస్సార్ చేసిన వ్యాఖ్యాలకు సవాలుగా కేసీఆర్ కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సభలో ప్రకటించారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కనీవిని ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ కోసం మహాధర్నా పేరిట రాజీవ్ రహదారిని దిగ్బంధించారు. సిద్దిపేట శివారులోని రాజీవ్ రహదారి పై జరిగిన కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. 2008లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించిన తర్వాత, కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేస్తూ సిద్దిపేటలో హరీశ్రావు నాయకత్వంలో నిర్వహించిన ఉద్యోగ గర్జనకు భారీ స్పందన లభించింది. 2009 నవంబర్లో సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న కేసీఆర్.. ‘తెలంగాణ వాలె జాగో.. ఆంధ్రా వాలె.. భాగో’.. అని నినాదమిచ్చారు. ఆ తర్వాత నవంబర్ 9 పాపన్నపేట మండలంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై పద్మాదేవేందర్రెడ్డి, దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆందోళనకు దిగారు. హరీశ్రావు, కేటీఆర్, ఈటల రాజేందర్ తదితరులంతా పాల్గొని ఆందోళన ఉధృతం చేశారు. హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఫ్రీజోన్ రద్దుకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో కేసీఆర్ ఆమరణ దీక్షకు నిర్ణయించారు.
టీఆర్ఎస్కు నాంది ఇక్కడే
1985 నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఓటమెరుగక సిద్దిపేట నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్, మంత్రిగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పలు పదవులు అలంకరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన జన్మభూమి పథకం రూపకల్పనలో ఆయన పాత్ర ముఖ్యమైంది. జన్మభూమి స్ఫూర్తితో తన స్వగ్రామం సిద్దిపేట మండలం చింతమడకలోని సొంత ఇంటిని ప్రభుత్వ పాఠశాల కోసం ఆయన విరాళంగా ఇచ్చారు. దానిని ఆనుకొని ఉన్న సుమారు మూడెకరాల స్థలాన్ని గ్రామంలోని వెనుకబడిన తరగతుల వారి ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా అందించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన చంద్రశేఖర్రావుకు అప్పటి ముఖ్యమంత్రి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు అప్పగించారు.
ఓ వైపు డిప్యూటీ స్పీకర్గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తప్పుబట్టారు. విద్యుత్ చార్జీల పెంపును తీవ్రంగా ఖండించారు. డిప్యూటీ స్పీకర్గా ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదిస్తూ బహిరంగ లేఖ రాశారు. అదే సమయంలో చంద్రబాబును విభేదించి, తన వైఖరిని వెల్లడించారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయంపై పిడికిలెత్తారు. ఆయన చొరవకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. అధికార పార్టీలో ఉండి పోరాటం చేయడం కన్న, ఎదురు నిలిచి ఉద్యమించాలని నిర్ణయించారు.
సిద్దిపేట వేదికగా కేసీఆర్ ఆమరణ దీక్ష
సిద్దిపేట వేదికగా కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగుతానని ప్రకటించడంతో మరోసారి జిల్లా వార్తల్లోకెక్కింది. ఆమరణ దీక్ష బయలుదేరిన కేసీఆర్ను నవంబర్ 29న కరీంనగర్ శివారులో పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం తరలించగా, సిద్దిపేట దీక్షా స్థలి వద్ద హరీశ్రావు, పద్మాదేవేందర్రెడ్డి, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి తదితర నాయకులు దీక్షకు సిద్ధమవడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఆ దీక్షాస్థలిని అణచివేయడం, హరీశ్రావు దీక్షా స్థలి వేదికపైనే ఒం టిపై కిరోసిన్ పోసుకోవడంతో రాష్ట్ర వ్యాప్త సంచలనమైంది. ఉద్యమం ఉధృతమైంది. ఒక వైపు కేసీఆర్ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించడంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యమం బాట పట్టడంతో జిల్లా విద్యార్థి లోకం లేచింది.
జిల్లా విద్యార్థి విభాగం నాయకులు విద్యార్థులను చైతన్యపరిచేందుకు విస్తృతంగా విద్యార్థి గర్జన పేరిట సదస్సు లు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో ఉద్యమంలో భాగం గా జాతీయ రహదారిపై భారీ ధర్నా చేశారు. రైలురోకోలు, తెలంగాణ కోసం రోడ్లపై వంటావార్పు, రోడ్ల దిగ్బంధం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమాన్ని రోజురోజుకూ ఉధృతపరుస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా ముందుకెళ్లిన ఉద్యమ టీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై కూడా పోరాటం చేసింది. ప్రతీ పౌరుడు ఉద్యమంలో భాగస్వాములను చేసింది. 42రోజుల పాటు జరిగిన సకల జనుల సమ్మెలో టీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. హరీశ్రావు(ప్రస్తుత మంత్రి) నేతృత్వంలోఉమ్మడి జిల్లాలో 132 కిలో మీటర్ల పాదయాత్ర నిర్వహించారు.
ప్రతీ ఎన్నికల్లో విజయదుందుబి
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో జిల్లాలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ దాని ప్రభావాన్ని స్పష్టంగా ప్రదర్శించింది. 2001లో పార్టీ ఏర్పాటైన రెండు నెలల వ్యవధిలోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుని రికార్డును సొంతం చేసుకుంది. ఆగస్టులో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. జడ్పీ వైస్ చైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. 2001 సెప్టెంబర్ 20న జరిగిన సిద్దిపేట అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లు గల్లంతు చేసి కేసీఆర్ తన సత్తాను చాటారు. సుమారు 58 వేల మెజార్టీతో శాసన సభకు ఎన్నికయ్యారు. జిల్లాలో జరిగిన ప్రతి ఎన్నికలోను తెలంగాణ వాదులు టీఆర్ఎస్కు తమ మద్దతును తెలుపుతూ వస్తున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ జిల్లాలోని సిద్దిపేట, దొమ్మాట, రామాయంపేట, సంగారెడ్డి స్థానాలను గెలుచుకుంది.
సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ లోక్సభ స్థానాలకు పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించిన కేసీఆర్ సిద్దిపేట స్థానానికి రాజీనామా చేశారు. రాజీనామాతో ఖాళీ అయిన సిద్దిపేట స్థానాన్ని తన రాజకీయ వారసుడిగా హరీశ్రావును ఎన్నికల్లో నిలిపారు. ఆ ఎన్నికల్లో హరీశ్రావు ఘన విజయం సాధించారు. ఉప ఎన్నికల్లోనూ ఇలా ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తన విజయాన్ని సొంతం చేసుకుంటూ వచ్చింది. తిరుగులేని పార్టీగా అవతరించింది. 2014, 2018 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం తన సత్తాను చాటింది. జిల్లా, మండల పరిషత్ తదితర ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేకుండా పోయింది.
పార్టీ ఆవిర్భావం..
2001 ఏప్రిల్ 14న సిద్దిపేటలో జరిగిన అంబేద్కర్ జయంతి సభలో పాల్గొన్న కేసీఆర్, తెలంగాణ కోసం పోరాటం తప్పదని నాడు ప్రకటించారు. ఉద్యమ పార్టీ ఆవిర్భావాన్ని కూడా ఆ రోజే వెల్లడించారు. 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ద్వారా ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ అనే ఉద్యమ పార్టీని స్థాపించారు .ఆ రోజు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు తెలంగాణ యావత్తు సమాజం పులకించింది. ఏప్రిల్ 27న ఉదయమే చంద్రశేఖర్రావుకు ఇష్టదైవమైన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పార్టీ జెండా క్యాసెట్లను స్వామివారి పాదాల వద్ద ఉంచి, పూజలు చేశారు. అనంతరం ‘జై తెలంగాణ .. జైజై తెలంగాణ’.. అంటూ ఉద్యమ జెండాను భుజానెత్తుకుని సుమారు వెయ్యి వాహనాల్లో భారీ కాన్వాయ్గా హైదరాబాద్కు బయలుదేరారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన వందల మంది ఆయనను అనుసరించారు.
ఇక్కడి నుంచి బయలుదేరిన చంద్రశేఖర్రావు హైదరాబాద్లోని జుబ్లీహిల్స్లోని తన ఇంటికి వెళ్లారు. రాజీవ్ రహదారి పొడవునా చంద్రశేఖర్రావు కాన్వాయ్తో నిండిపోయింది. ఇంటి దాకా ప్రభుత్వ వాహనంలో ప్రయాణించిన చంద్రశేఖర్రావు, అక్కడి నుంచి తన సొంత వాహనంలో బయలుదేరి హుస్సేన్సాగర్ సమీపంలోని జలదృశ్యం సభావేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆయన ఏం చేస్తున్నారన్న ఉత్కంఠ ప్రజల్లో ఉంది. సభలో తన మనసులో మాట బయటపెట్టారు. తెలంగాణ కోసం తన పదవులకు రాజీనామా చేస్తూ మూడు లేఖలు చంద్రబాబుకు పంపించారు. డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ సభ్యత్వం, పార్టీ పదవులకు ఒకే సారి రాజీనామా చేసి, ఆ సమయంలో ఒక రికార్డు నెలకొల్పారు. ‘పదవుల కోసం కాదు.. ప్రజల కోసం పోరాటం’.. అంటూ తన లక్ష్యాన్ని ప్రకటించారు. పదవులు వదలుకోవడమనేది అప్పటి వరకు ఎవరు ఊహించని చర్య.