కామారెడ్డి టౌన్, మే 3: కరోనా సంక్షోభ సమయంలో ప్రతి కూలీకి పని కల్పించడం, కూలీల శాతం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని ఉపాధి హామీ అధికారులను కలెక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన క్యాంప్ కార్యాలయం నుంచి సెల్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, ఎంపీవోలు, ఏపీవోలు, ఏపీడీ, మండల స్పెషల్ ఆఫీసర్లు, క్లస్టర్ ఆఫీసర్లతో ఉపాధి హామీ పనులను మండలాల వారీగా సమీక్షించారు. కరోనా కష్టకాలంలో కూలీలకు ఆర్థికంగా చేయూత అందించాలని, గత సంవత్సరం ఇదే సమయంలో నిర్వహించిన కూలీల శాతాన్ని ప్రస్తుత సమయంలో సాధించాలని ఆదేశించారు. ముఖ్యంగా బిచ్కుంద, బీర్కూర్, మద్నూర్, కామారెడ్డి, బీర్కూర్, ఎల్లారెడ్డి, పిట్లం, నస్రుల్లాబాద్, బాన్సువాడ, రాజంపేట, జుక్కల్ మండలాల్లో ఆశించినంత ప్రగతి లేదని, వచ్చే గురువారంలోగా కూలీల శాతాన్ని పెంచాలని ఆదేశించారు.
పెద్దకొడప్గల్, నాగిరెడ్డిపేట, తాడ్వాయి మండలాల్లో కొంత మాత్రమే ప్రగతి సాధించారని, మరింత పెంచుకోవాలని సూచించారు. దోమకొండ, లింగంపేట, నిజాంసాగర్, బీబీపేట, రామారెడ్డి, గాంధారి మండలాల్లో పనులు బాగా జరుగుతున్నాయని అభినందించారు. తక్కువగా కూలీల శాతం నమోదైన మండలాల్లోని పంచాయతీ సెక్రటరీలతో కలిసి శ్రమశక్తి సంఘాల తోడ్పాటుతో కొత్తగా గుర్తించిన పనులను ప్రారంభించుకునేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. నీటి సంరక్షణ పనుల కింద చాలా పనులు చేపట్టవచ్చని, మేజర్, మైనర్, మీడియం కాల్వల్లో పూడికతీత పనులను నీటిపారుదల శాఖ ఇంజినీర్ల సమన్వయంతో చేపట్టాలని సూచించారు. ప్రస్తుత కరోనా సమయంలో కూలీలకు ఆర్థిక వెన్నుదన్ను కల్పించేందుకు ఉపాధి హామీ పనుల నిర్వహణలో ప్రతి ఒక్క అధికారి చిత్తశుద్ధితో పనిచేయాలని, కరోనా నిబంధనలు పాటిస్తూ లక్ష్యాలను సాధించాలని సూచించారు.