హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో శుక్రవారం మొదటిరోజు స్పెషల్ కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతమైంది. హైరిస్క్ ఉన్న నిత్య సేవలకులకు 30 సర్కిళ్ల పరిధిలోని 31 కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు వేశారు. ముందస్తుగా 30 వేల మందికి టోకెన్లు అందించగా.. 21,666 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. వీరిలో 44 ఏండ్లలోపు వయస్సువారు 15,963 మంది, 45 ఏండ్లు పైబడివారు 5,703 మంది ఉన్నారు. మొదటి డోసుగా ప్రతి ఒక్కరికీ కొవిషీల్డ్ టీకా వేశారు. వ్యాక్సిన్నేషన్ ప్రక్రియను ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. టీకా వేసుకున్నవారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రోజూ 30 వేల మందికి చొప్పున వచ్చే తొమ్మిది రోజుల పాటు ఈ స్పెషల్డ్రైవ్ కొనసాగనున్నది.
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్డ్రైవ్ వ్యాక్సినేషన్ ద్వారా 3 రోజుల్లో 1.4 లక్షల మందికి టీకా వేయనున్నట్టు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. వారంపాటు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని.. ప్రతిరోజూ 30 వేల మందికి వ్యాక్సిన్ వేస్తామని పేర్కొన్నారు. హైరిస్ గ్రూపులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైందని సీఎస్ తెలిపారు. జీహెచ్ఎంసీలో 32 సెంటర్లు ఏర్పాటుచేసినట్టు వివరించారు. శుక్రవారం ఉదయం పబ్లిక్గార్డెన్కు ఎదురుగా ఉన్న రెడ్రోస్ ఫంక్షన్హాల్లో వ్యాక్సిన్ కేంద్రాన్ని సీఎస్ సందర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెంటర్లలో ఉదయం 8 నుంచే వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. అధికారులు గుర్తించి కూపన్లు జారీచేసిన వీధి వ్యాపారులు, కిరాణాషాపులు, పెస్టిసైడ్ షాపుల్లో పనిచేస్తున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు చెప్పారు. అనంతరం సీఎస్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి, పబ్లిక్హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.