జమ్మికుంట, మే 27: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ భూములను చెరపట్టిన వ్యక్తిని బీజేపీలో ఎలా చేర్చుకుంటారని ఆ పార్టీ నేత, జమ్మికుంట మాజీ జడ్పీటీసీ సభ్యుడు అరుకాల వీరేశలింగం ప్రశ్నించారు. అక్రమ ఆస్తులు, వేల కోట్ల రూపాయలు కాపాడుకొనేందుకే ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. డబ్బు, భూములు సంపాదించడమే ఆయన లక్ష్యమని, బీసీ ముసుగు వేసుకున్న రెడ్డి అని మండిపడ్డారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ.. ఈటల పెట్టిన బాధలకు, అణచివేతకు ఎందరో బలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. మొదటి నుంచీ గులాబీ జెండా పట్టుకొని తిరిగినోళ్లందరినీ ఎదగనియ్యలేదని, తన కోసం పనిచేసినోళ్లంతా కూలోళ్లయ్యారని, ఆత్మగౌరవమనే పదం ఉచ్చరించడానికి ఈటల అనర్హుడని ఆగ్రహించారు. ఆయన కోసం పనిచేసినోళ్లందరినీ అవమానించారని, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకొనేందుకు టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లామని, నీడనిచ్చిన పార్టీని దగాచేసి, బీజేపీలోకి ఎట్లా వస్తావని నిలదీశారు.
నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీజేపీలో చేరినా.. మరే ఇతర పార్టీలోకి వెళ్లినా ఆయనను ఓడించడమే తన ధ్యేయమని స్పష్టంచేశారు. 2004, 2008 ఎన్నికల సమయంలో తాను ఓట్ల కోసం ఇంటింటికీ తిరిగి రాజేందర్ను గెలిపించానని, తాను జడ్పీటీసీగా గెలిచిన తర్వాత ఈటల అవమానించారని ఆవేదన వ్యక్తంచేశారు. గెలిచిన ప్రతిసారీ తమ రుణం తీర్చుకుంటానని అనేవారని, తాము టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేలా చేసి రుణం తీర్చుకున్నారని మండిపడ్డారు. తాను టీఆర్ఎస్ తరఫున జడ్పీటీసీగా గెలిచి, ఈటల అణచివేత భరించలేక మూడేండ్లకు పార్టీని వీడిన తీరును వివరించారు. భూకబ్జా కేసుల్లో ప్రభుత్వం తనను ఎక్కడ జైలుకు పంపుతుందోనన్న భయంతోనే బీజేపీలోకి వస్తున్నారని ఆరోపించారు.
ఆయనకు బీసీలంటే గౌరవం లేదని, ప్రజలు తప్పకుండా తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. గులాబీ కండువా లేనిది.. టీఆర్ఎస్ ప్రభుత్వం లేనిది మనం లేం.. సంక్షేమం లేదు.. అభివృద్ధి లేదు అని ఎన్నో సభల్లో చెప్పిన ఆయనే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం సమంజసం కాదని సూచించారు. దీనిపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు. నియోజకవర్గంలో గ్రామగ్రామాన ఆయన వల్ల బాధ పడనోళ్లేవరో చెప్పాలని, బహిరంగ చర్చకు రావాలని సవాల్చేశారు. ఇకనైనా ప్రజలను మోసం చేయడం మానుకోవాలని హితవుపలికారు. ఆయన కుటుంబసభ్యులంతా ‘రెడ్డి’ వారేనని, అలాంటి ఆయన బీసీ ఎలా అవుతారని ప్రశ్నించారు. రాజేందర్ను ప్రజలెవరూ నమ్మవద్దని, ఒకవేళ ఎన్నికలు వస్తే ఆయనను ఓడించాలని విజ్ఞప్తిచేశారు.
మాజీ మంత్రిపై కరీంనగర్ మేయర్ సునీల్రావు ఆగ్రహం
మంత్రిగా బాధ్యత మరిచి, అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఈటల రాజేందర్ అసైన్డ్ భూములు ఆక్రమించడం, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అక్రమంగా ఆర్జించడం చట్టవ్యతిరేకమైన చర్య అని కరీంనగర్ మేయర్, టీఆర్ఎస్ హుజూరాబాద్ మున్సిపాలిటీ, మండల ఇంచార్జి యాదగిరి సునీల్రావు ఆరోపించారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఆయన మాట్లాడారు. ఏమాత్రం నైతికత ఉన్నా ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్చేశారు.
జైలు జీవితం తప్పించుకోవడానికే ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారని ఎన్ఎస్యూఐ కరీంనగర్ జిల్లా మాజీ నాయకుడు తిప్పారపు సంపత్ ఆరోపించారు. గురువారం హుజూరాబాద్లో ఆయన మాట్లాడుతూ.. ఆత్మాభిమానం పేరిట ఇన్నాళ్లూ మోసం చేసిన ఈటల ప్రజలకు క్షమాపణ చెప్పి బీజేపీలో చేరాలని డిమాండ్చేశారు. ఈటల కుమారుడు నితిన్రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ అనే బినామీ పేరుతో డబుల్బెడ్రూం ఇండ్లను నాసిరకంగా నిర్మించారని, వీటిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్చేశారు. యావా అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం బీజేపీలో ముసలం రేపుతున్నది. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటూ, ఆ ఆరోపణలపై విచారణ జరుగుతున్న వ్యక్తిని పార్టీలోకి తీసుకొనేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. బీజేపీలోని ఒక వర్గం ఈటలను పార్టీలోకి తీసుకొనేందుకు అదేపనిగా మంతనాలు సాగించటాన్ని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తప్పుబట్టారు. ఈటల విషయంలో రాష్ట్ర నాయకత్వం తొందరపడుతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు మాట మాత్రమైనా చెప్పుకుండా ఈటలతో చర్చలు జరపటాన్ని తప్పుబట్టారు. ప్రజాస్వామ్యం అని చెప్పుకొనే పార్టీ వ్యక్తిస్వామ్యం పార్టీ కంటే అధ్వాన్నంగా నిర్ణయాలు తీసుకోవటం సరికాదని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈటల వ్యవహారంలో బీజేపీలోని కొంతమంది నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. తనను, నియోజవకర్గ ఇన్చార్జి, మండల నాయకులకు కనీసం సమాచారం ఇవ్వలేదని అన్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. హైదరాబాద్లోని వివేక్ ఫామ్ హౌజ్లో ఈటలతో చర్చలు జరిపిన సందర్భంలో తానెందుకు గుర్తుకు రాలేదని ఆయన ఆవేదన చెందారు. కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి విషయంలో పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సిద్ధాంత పునాదుల మీద నిర్మించిన పార్టీలో ఇలా ఆనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవటం సరికాదన్నారు. స్థానిక నేతలు, జిల్లా నేతలతో చర్చించిన తరువాతనే ఈటల వ్యవహారంలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న విషయాన్ని పెద్దిరెడ్డి గుర్తుచేస్తూ.. తమ పార్టీలో ఇటువంటివి లేకపోవడం విచారకరమన్నారు. తాను రెండు పర్యాయాలు మంత్రిగా వ్యవహరించానని చెప్తూ.. తమ పార్టీలో తనతో కనీసం మాట మాత్రమైనా చెప్పకపోవటానికి తనకు ఆ స్థాయిలేదని భావిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.