తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 14 నీటి వనరుల్లో 20 లక్షల చేప పిల్లలు, 1.50 లక్షల రొయ్య పిల్లల విడుదల.
ఈ ఏడు టార్గెట్
సిద్దిపేట, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు చేపలంటే కోస్తా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారనే భావన ఉండేదని, సీఎం కేసీఆర్ చొరవతో ఏడేండ్లలోనే ఉత్తరాదితోపాటు విదేశాలకూ ఎగుమతి చేసేస్థాయికి తెలంగాణ చేరుకున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు. బుధవారం సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్, సిద్దిపేట కోమటి చెరువులో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి చేప పిల్లలు, రొయ్య పిల్లలను వదిలి రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఉచిత చేప పిల్లల పంపిణీతో రాష్ట్రంలో నీలి విప్లవం వచ్చిందని, మత్సకారుల జీవితాల్లో సీఎం కొత్త వెలుగులు తీసుకొచ్చారని తెలిపారు. గోదావరి, కృష్ణా జలాల్లో పెరిగే తెలంగాణ చేపలకు భారీ డిమాండ్ ఉన్నదన్నారు. ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలో రూ. 4.87 కోట్లతో అన్ని జలాశయాలు, చెరువుల్లో 4.19 కోట్ల చేప పిల్లలను వదులుతున్నామని వెల్లడించారు. ఒకప్పుడు గుక్కెడు నీటి కోసం గోసపడ్డ ఈ ప్రాంతం నేడు పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నదని సంబురపడ్డారు. తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందని, ఎక్కడ చూసినా ధాన్యపుసిరులు, మత్స్య సంపద కళ్లముందు కనబడుతున్నదని చెప్పారు. కుల వృత్తులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని హరీశ్రావు స్పష్టంచేశారు.
రూ.750 కోట్ల టర్నోవర్కు విజయ డెయిరీ: మంత్రి తలసాని
ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విజయ డెయిరీని తెలంగాణలో రూ.750 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించే స్థాయికి తీసుకెళ్లామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. వచ్చే ఒకటి రెండేండ్లలో ఫెడరేషన్ ద్వారానే చేపల మార్కెటింగ్ చేసేలా కార్యాచరణ సిద్ధ్దం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి అనితా రామచంద్రన్, మత్స్యశాఖ కమిషనర్ భూక్యా లచ్చిరాం నాయక్, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజుల పాల్గొన్నారు.
పండుగలా చేప పిల్లల విడుదల
నమస్తే తెలంగాణ నెట్వర్క్: చేప పిల్లల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగవాతావరణంలో ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లా బాల్కొం డ మండలం నాగాపూర్లోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చేప పిల్లలను విడుదల చేశారు. వికారాబాద్ జిల్లా కోట్పల్లి ప్రాజెక్టులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా కోడూరులోని మైసమ్మ చెరువులో మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పెద్ద చెరువులో, నల్లగొండ జిల్లా నకిరేకల్ పెద్ద చెరువులో మంత్రి జగదీశ్రెడ్డి ఉచిత చేప పిల్లలను వదిలారు.