హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ ఉత్పత్తుల్లో సత్తా చాటుతున్న తెలంగాణ రైతు.. రుణాల విషయంలో పొదుపు మంత్రం జపిస్తున్నాడు. తక్కువ రుణాలు తీసుకొంటూనే.. ఎక్కువ పంట పండిస్తున్నాడు. దేశంలోని ఎనిమిది ప్రధాన వ్యవసాధారిత రాష్ర్టాల్లో సగటు వ్యవసాయ కుటుంబ రుణాల్లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్, రెండో స్థానంలో కేరళ, మూడో స్థానంలో పంజాబ్, నాలుగో స్థానంలో హర్యానా రైతులు ఉన్నారు. ఏపీ రైతు సగటున ఏటా రూ.2.45 లక్షల రుణం తీసుకోగా, కేరళ రైతులు రూ.2.42 లక్షలు, పంజాబ్లో రూ. 2.03 లక్షలు, హర్యానాలో రూ.1.82 లక్షల రుణం తీసుకొంటున్నారు. తెలంగాణ రైతులు మాత్రం సగటున రూ.1.52 లక్షల రుణం తీసుకొంటున్నారు. ఆరోస్థానంలో కర్ణాటక (రూ.1.26 లక్షలు), ఏడోస్థానంలో రాజస్థాన్ (రూ.1.13 లక్షలు), ఎనిమిదో స్థానంలో తమిళనాడు (రూ.1.06 లక్షలు) ఉన్నాయి. కేంద్ర గణాంకాల శాఖ నిర్వహించిన ‘సిచ్యువేషన్ అసెస్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ హౌస్హోల్డ్స్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఆఫ్ హౌస్హోల్డ్స్ ఇన్ రూరల్ ఇండియా-2019’ సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
పెట్టుబడి కోసమే..
వ్యవసాయం కోసం తీసుకొంటున్న రుణాలను సద్వినియోగం చేసుకోవటంలో మన రైతులే దేశంలో మొదటిస్థానంలో ఉన్నారు. 46.1 శాతం రుణాన్ని పెట్టుబడి కోసం ఖర్చు చేస్తున్నారు. 16.9 శాతం మాత్రమే మూలధన వ్యయం (క్యాపిటల్) చేస్తున్నట్టు సర్వేలో తేలింది. పెట్టుబడి వ్యయం ఎంత ఎక్కువ ఉంటే రాబడి కూడా అంత ఎక్కువ ఉంటుంది. క్యాపిటల్ వ్యయం పెరుగుతున్నాకొద్ది రాబడి తగ్గుతుంది. తెలంగాణ రైతు పంటలపై పెట్టుబడి ఎక్కువ పెట్టి.. అందుకు తగ్గట్టుగానే ఆదాయం పొందుతున్నారు. గతేడాది ఏకంగా రూ.లక్ష కోట్ల విలువైన పంట పండించారు. దేశంలో సగటున అధిక విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తున్న రైతుల్లో తెలంగాణ రైతు రెండో స్థానంలో నిలిచారు. రాజస్థాన్ రైతులు సగటున 1.58 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తూ తొలి స్థానంలో ఉన్నారు. మన రాష్ట్రంలో ఒక్కో రైతు సగటున 1.50 హెక్టార్లలో వ్యవసాయం చేస్తున్నారు.
పెరిగిన సాగు.. ఉత్పత్తి
తెలంగాణలో గత ఏడేండ్లలో కొత్తగా 32 లక్షల ఎకరాలకుపైగా భూమి సాగులోకి వచ్చింది. వరి సాగు, ఉత్పత్తిలో రాష్ట్రం మేటిగా నిలిచింది. గతేడాది సుమారుగా 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. గత రెండు సీజన్లలో కేంద్ర ఆహార సంస్థ తెలంగాణ నుంచే ఎక్కువ ధాన్యం సేకరించింది. ఈ విషయం స్వయంగా ఎఫ్సీఐ వెల్లడించింది. కొత్త నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల సాగునీరు పుష్కలంగా లభిస్తుండటంతో సాగు విస్తీర్ణం పెరిగింది. సాగు పెరిగితే రైతు పెట్టుబడి కూడా పెరుగుతుంది. ఆ పెట్టుబడికోసం రైతులు రుణాలపై ఆధారపడక తప్పదు. అయినా తెలంగాణ రైతులు ఇతర రాష్ర్టాల రైతులతో పోల్చితే రుణాలు తక్కువగానే తీసుకొంటున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు.. రైతులు ఎక్కువగా రుణాలపై ఆధారపడకుండా నిలువరిస్తున్నది.