హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీటిపారుదల, విద్యుత్తు, ఆర్అండ్బీ విభాగాల్లోని ఇంజినీర్లు పోషిస్తున్న పాత్ర ఎనలేనిదని, వారి కృషి వల్లే సాగునీటి ప్రాజెక్టులు, మిషన్భగీరథ తదితర పనులు త్వరగా పూర్తయి అందుబాటు లో వస్తున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కొనియాడారు. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందంటే అది ఇంజినీర్ల కృషేనని, తెలంగాణ ఇంజినీర్లు దేశానికే మార్గదర్శకులని ప్రశంసించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్, ఇంజినీర్స్ జేఏసీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్, ఇంజినీర్స్ ఫెడరేషన్, సింగరేణి రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎర్రమంజిల్లోని జలసౌధలో తెలంగాణ ఇంజినీర్స్ డే వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్తో కలిసి వినోద్కుమార్.. నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్, ఆర్ విద్యాసాగర్రావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆన్లైన్ ద్వారా నిర్వహించిన సమావేశంలో వినోద్కుమార్ ప్రసంగించారు. హైదరాబాద్ రాజ్యంలో విశేషసేవలు అందించిన నవాజ్ జంగ్ బహదూర్ వారసత్వాన్ని తెలంగాణ ఇంజినీర్లు గొప్పగా కొనసాగిస్తున్నారని అభినందించారు. ఉమ్మడి రాష్ట్రంలో అలీ నవాజ్ జంగ్ చరిత్ర కనుమరుగైందని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆయన పుట్టినరోజును తెలంగాణ ఇంజినీర్స్డేగా అధికారికంగా ప్రకటించటం ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా 2021 సంవత్సరానికి సాగునీటి పారుదలశాఖ విశ్రాంత కమిషనర్ సానా మారుతి, టీఎస్ట్రాన్స్కో డైరెక్టర్ (లిఫ్ట్స్) సూర్యప్రకాశ్, సింగరేణి మాజీ డైరెక్టర్ వాసుదేవ్రావుకు జీవిత సాఫల్య పురస్కారాలను ప్రదా నం చేశారు. జీవిత సాఫల్య పురస్కారాలు అందుకొన్న సీనియర్ ఇంజినీర్లకు వీ ప్రకాశ్ అభినందనలు తెలిపారు. నవాజ్ జంగ్ బహదూర్ జీవిత విశేషాలు, హైదరాబాద్ రాజ్యంలో ఆయన నిర్మించిన పలు ప్రాజెక్టులు, కట్టడాల ప్రాధాన్యాలను ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే ఇంజినీర్లకు వివరించారు. విశ్రాంత చీఫ్ ఇంజినీర్ జనార్దన్ అధ్యక్షతన కొనసాగిన ఈ కార్యక్రమంలో మరో ముఖ్యఅతిథిగా సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్రావు, రిటైర్డ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.