హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్వేవ్ దేశం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో పలు రాష్ర్టాలు సందర్శకుల విషయంలో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. కొవిడ్ ఉద్ధృతంగా ఉన్న రాష్ర్టాలకు చెందినవారినైతే అసలు అనుమతించేందుకు నిరాకరిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలనుంచి వచ్చేవారు 72 గంటలు ముందుగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకొని నెగెటివ్ అని తేలితేనే రావాలని తేల్చి చెప్తున్నాయి. కొన్ని రాష్ర్టాలు నెల ముందునుంచే ఈ ఆంక్షలను అమలులో పెట్టాయి.
రాజస్థాన్: ఏ రాష్ట్రంనుంచి వచ్చేవారైనా తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి.
మహారాష్ట్ర: గుజరాత్, ఢిల్లీ, గోవా, రాజస్థాన్, కేరళ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ అని వస్తేనే రాష్ట్రంలోకి రావాలి. విమానాల్లో వచ్చేవారికైనా, రైలు, బస్సు ప్రయాణికులకైనా ఈ నిబంధన వర్తిస్తుంది.
కర్ణాటక: మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చేవారు తప్పనిసరిగా కొవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి.
ఉత్తరాఖండ్: మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే తప్పనిసరిగా కొవిడ్-19 నెగెటివ్ రిపోర్ట్తో రావాలి. రిపోర్టు లేకుండా వచ్చేవారికి సరిహద్దుల్లో, రైల్వే స్టేషన్లలో, డెహ్రాడూన్ ఎయిర్పోర్టులో పరీక్ష చేస్తారు. పాజిటివ్ వస్తే తిప్పి పంపుతారు.
గుజరాత్: రాష్ట్రంలోని అన్ని సరిహద్దు చెక్పోస్టుల వద్ద స్క్రీనింగ్ యంత్రాలు ఏర్పాటుచేసింది. రోడ్డు మార్గంలో వచ్చేవారికి అక్కడే పరీక్షలు చేసి నెగెటివ్ వస్తేనే అనుమతిస్తున్నది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సైతం మహారాష్ట్రతో సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో ఇదే విధానాన్ని అమలుచేస్తున్నది. ఛత్తీస్గఢ్, మణిపూర్, అస్సాం, జమ్ముకశ్మీర్, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ర్టాలు కూడా ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ తెచ్చుకోవాలని ఆంక్షలు విధించాయి.