ఎస్పీ వెంకటేశ్వర్లు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 10 : కరోనా సమయంలో అత్యవసర వైద్యసేవల కోసం తప్పా ఎవరూ అనవసరంగా బయటికి రావొద్దని లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తామని మహబూబ్నగర్ ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు హెచ్చరించారు. పట్టణంలోని క్లాక్టవర్లో గురువారం లాక్డౌన్ పరిస్థితులను, బందోబస్తు తీరును ఎస్పీ పర్యవేక్షించారు. వన్టౌన్ పీఎస్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 6గంటల తర్వాత ఎస్పీ పర్యవేక్షించారు. అలాగే వాహనదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లాక్డౌన్ ని బంధనలు వ్యతిరేఖంగా బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వన్టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని పాత పాలమూరు అంబేద్కర్ విగ్రహం ములమలుపు వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని వన్టౌన్, ట్రాఫిక్ ఇన్సెక్టర్లు రాజేశ్వర్గౌడ్, అశోక్గౌడ్ను ఆదేశించారు.
నిబంధనలు ఉల్లంఘించొద్దు
కోయిలకొండ, జూన్ 10 : ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను గురువారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మండలంలో లాక్డౌన్ అమలుపై సమీక్షించారు. పోలీస్స్టేషన్లో మొక్కల సంరక్షణ, పూల మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్కు ప్రహరీ నిర్మాణంతో పాటు, రిసెప్షన్ గదిని వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీధర్, ఎస్సై సురేశ్గౌడ్ పాల్గొన్నారు.