జహీరాబాద్, మే 16: జహీరాబాద్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. జహీరాబాద్ డివిజన్లో ఆదివారం లాక్డౌన్ సడలింపు సమయమైన ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారు. 10 గంటల తర్వాత పోలీసులు దుకాణాలు మూసివేయించారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని 65వ జాతీయ రహదారి, బీదర్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేసి అనుమతి లేని వాహనాలను నిలిపివేశారు. జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. పోలీసులు లాక్డౌన్ సందర్భంగా నిబంధనలు పాటించని, మాస్క్లు లేకుండా తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.
ఐదోరోజూ కొనసాగిన లాక్డౌన్
అందోల్, మే 16: నియోజకవర్గం వ్యాప్తంగా లాక్డౌన్ పకడ్బందీగా సాగుతున్నది. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో అన్నివర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుండగా, ఆదివారం వాహనాల రాకపోకలు, జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. అందోల్-జోగిపేట మున్సిపాలిటీతో పాటు హత్నూర, పుల్కల్, మునిపల్లి, వట్పల్లి, చౌటకూర్, రాయికోడ్ మండల్లాలో లాక్డౌన్కు ప్రజలు, వ్యాపారుల స్వచ్ఛందంగా సహకరిస్తుండగా, పోలీసులు ప్రధాన రహదారులు, చౌరస్తాలపై గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తల్తెకుండా చర్యలు చేపడుతున్నారు. ఆదివారం జోగిపేట పట్టణంలో వారాంతపు సంతకావడంతో ప్రజలు, వ్యాపారులు పెద్దసంఖ్యలో ఒకేచోట గుమిగూడి కొనుగోళ్లు జరిపారు.
ఖేడ్లో పకడ్బందీగా లాక్డౌన్
నారాయణఖేడ్, మే 16: నారాయణఖేడ్ పట్టణంలో ఉదయం 10 గంటల తర్వాత ప్రధాన రహదారులతో పాటు వీధులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తూ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కంగ్టి, నాగల్గిద్ద మండలాల్లోని రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేయ గా, వాహన రాకపోకలను నిలువరిస్తున్న పోలీసులు అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక కల్హేర్, మనూరు, సిర్గాపూర్ మండలాల్లోనూ లాక్డౌన్ కట్టుదిట్టంగా కొనసాగుతున్నది. ముఖ్యంగా మండల కేంద్రాల్లో లాక్డౌన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
కరోనా నిబంధనలు పాటిద్దాం
ఝరాసంగం, మే 16: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన లాక్డౌన్ను మండల ప్రజలంతా సమష్టిగా ఉంటూ కరోనాపై పోరుకు, సామాజిక దూరం పాటించడం అభినందనీయమని తహసీల్దార్ తారాసింగ్ అన్నారు. లాక్డౌన్ సందర్భంగా ఆదివారం మండల కేంద్రమైన ఝరాసంగంతోపాటు పలు గ్రామాల్లో ఇండ్ల్లలోనుంచి ప్రజలు ఎవరూ బయటకు రాకపోవడం మూలంగా గ్రామాల్లోని ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లే గర్భణీ, బాలింతలకు పౌష్టికాహారాన్ని వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తామన్నారు