ధరణిలో అందుబాటులోకి..
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): పొరపాటున నిషేధిత జాబితాలో పడిన భూములకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ధరణిలో అవకాశం కల్పించింది. కొందరు రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదం కారణం గా పలువురు రైతుల భూములు నిషేధిత జాబితాలో చేరాయి. ఇతర కారణాలతోనూ కొన్నిభూములు ఈ జాబితాలో కనిపిస్తున్నాయి. దీంతో ఈ భూములకు రైతుబంధు, రైతుబీమా ప్రయోజనాలు అందకపోగా.. క్రయవిక్రయాలు జరుగక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా సిటిజన్ లాగిన్లో ప్రత్యేకంగా అవకాశం కల్పించింది. ‘గ్రీవెన్స్ రిలేటింగ్ టు ఇన్క్లూషన్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్’ పేరుతో మాడ్యూల్ను అందుబాటులోకి తెచ్చింది. బాధితులు స్వయంగా దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. సిటిజన్ లాగిన్లో ఈ ఆప్షన్ను ఎంచుకున్న తర్వాత జిల్లా, మండలం, గ్రామం, సర్వేనంబర్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. నిషేధిత జాబితాలో ఉన్న సర్వేనంబర్లు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. ఆ భూమిని ఎందుకు జాబితా నుంచి తొలిగించాలో కారణం వివరిస్తూ, తగిన ధ్రువపత్రాలను లేదా పట్టాదార్ పాస్పుస్తకాలను జత చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు నేరుగా కలెక్టర్ లాగిన్కు వెళ్తుంది. అక్కడ పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటారు.