ప్రతిపక్షాలపై మండలి మాజీ చైర్మన్ గుత్తా ఫైర్
దేవరకొండ, జూలై 10: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శనివారం దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ నివాసంలో గుత్తా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అలజడి రేపేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారం చెలాయించిన నాయకులే జల దోపిడీకి పాల్పడ్డారన్నారు. రూ.3 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లించినా రాష్ర్టానికి రావాల్సిన వాటా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. పునర్విభజన చట్టం హామీలను అమలు చేయకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నదన్నారు. ఆంధ్రా పాలకుల కుట్రతోనే రేవంత్రెడ్డికి పీసీసీ పదవి వచ్చిందని స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఆరోపిస్తున్నారని తెలిపారు. షర్మిల పార్టీ వెనుక జల దోపిడీ కుట్ర దాగి ఉన్నదని ఆరోపించారు. గుత్తా వెంట దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఉన్నారు.