మంచు కొండల్లో రాజకీయ వేడి రాజుకున్నది. జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశాక అక్కడి స్థానిక రాజకీయ నేతలతో తొలిసారిగా కేంద్రప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో గురువారం జరుగనున్న ఈ భేటీ ముఖ్యోద్దేశం ఏమిటి? నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడే తెరపైకి ఎందుకొచ్చింది? రాష్ట్ర హోదా కోల్పోయిన కశ్మీరానికి ఆ హోదా మళ్లీ కట్టబెడుతారా? కేంద్రం ప్రతిపాదనలకు స్థానిక పార్టీలు సమ్మతిస్తాయా?
గురువారం జరుగనున్న అఖిలపక్ష సమావేశం ఎజెండా ఏమిటన్నదానిపై అధికారికంగా పూర్తిస్థాయి స్పష్టతలేదు. అయితే, కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, దీనికోసం నియోజకవర్గాల పునర్విభజన, అభివృద్ధి తదితర అంశాలను చర్చించవచ్చు. ‘ప్రత్యేక ప్రతిపత్తి’, రాష్ట్ర హోదా అంశాన్ని స్థానిక పార్టీలు లేవనెత్తే అవకాశమున్నది. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన దాదాపు రెండేండ్ల తర్వాత కేంద్రం రాజకీయ ప్రక్రియను మొదలు పెట్టడం, అఖిలపక్ష నేతలను భేటీకి ఆహ్వానించడం, నేతలు కూడా సమావేశానికి హాజరయ్యేందుకు సముఖంగా ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యం లభించింది.
కేంద్రం వ్యూహం ఏమిటి?
87 స్థానాలున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి (పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 24 సీట్లకు కాకుండా) 2014లో ఎన్నికలు జరిగాయి. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేశారు. జమ్ముకశ్మీర్, లఢక్ను యూటీలుగా గుర్తిస్తూ జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీంతో పరిస్థితులు చక్కబడ్డాక జమ్ముకశ్మీర్కు రాష్ట్రహోదా పునరుద్ధరిస్తామని మోదీ గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో హామీ ఇచ్చారు. జమ్ము కశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించి ఎన్నికలకు వెళ్లాలంటే ముందుగా నియోజక వర్గాల పునర్విభజన తప్పనిసరి. 1996లో చివరిసారిగా కశ్మీర్లో నియోజక వర్గాల పునర్విభజన జరిగింది. అయితే, 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 25 సీట్లు జమ్ము ప్రాంతానికి చెందినవే. తాజాగా చేపట్టాలనుకుంటున్న నియోజక వర్గాల పునర్విభజనలో జమ్ముకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ ప్రాంతంలో సీట్లు పెరిగితే రాజకీయంగా మరింత బలపడొచ్చని బీజేపీ యోచన. అయితే, ఈ వ్యూహాన్ని విపక్ష నేతలు ఎంతవరకు అంగీకరిస్తారో చూడాలి.
ఎల్వోసీలో అలర్ట్
గురువారం అఖిలపక్షం నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు నెలకొనకుండా వాస్తవాధీనరేఖ (ఎల్వోసీ), జమ్ముకశ్మీర్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు. అవసరమైతే కశ్మీర్లో గురువారం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే అవకాశమున్నదని తెలిపారు. మరోవైపు, లఢక్కు యూటీ హోదా ఇచ్చినప్పటికీ, అభివృద్ధి మాత్రం తగినంత జరుగలేదని అక్కడి రాజకీయ పార్టీలు ఆరోపించాయి. ప్రత్యేక చట్టం, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం ఇక్కడి ప్రజలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని డిమాండ్ చేశాయి.