దేశంలో దళితుల ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్. నా రాజకీయ జీవితం మొత్తంలో ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. దళితబంధు లాంటి పథకం దేశంలో మరెక్కడా లేదు. ఒక్కో దళిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తుంటే ప్రతిపక్షాలకు ఎందకు కష్టమైతున్నది?
హైదరాబాద్/ అమీర్పేట్/కవాడిగూడ/ఆర్కేపురం ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): దళితుల జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రారంభించిన దళితబంధు పథకంపై విపక్షాల విమర్శలు సిగ్గుచేటని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. దళితుల కోసం రూ.10 లక్షలు ఇవ్వాలనే ఆలోచన చేసిన సీఎం కేసీఆర్ బతికి ఉన్నన్ని రోజులు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు. దళితబంధుతో భారత రాజకీయాలను శాసించే నాయకుడిగా కేసీఆర్ ఎదుగుతారని ధీమా వ్యక్తంచేశారు. తన నలబై ఏండ్ల రాజకీయ జీవితంలో దళితజాతి కోసం ఎంత బడ్జెట్ అయినా ఖర్చుపెడతా అని ప్రకటించిన కేసీఆర్ లాంటి సీఎంను చూడలేదన్నారు. దళితబంధుపై విపక్షాల కుట్రలకు నిరసనగా ఆదివారం మోత్కుపల్లి నర్సింహులు బేగంపేటలోని తన నివాసంలో ఒక రోజు దీక్ష చేపట్టారు. ఉదయం లోయర్ ట్యాంక్బండ్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి వచ్చి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘దళితులు చెప్తే చేతుల ఉంటరా.. ఊళ్లలో పని ఎవరు చేయాలే.. చాకిరీ ఎవరు చేయాలె.. బానిసత్వం ఎవరు చేయాలె.. చీపురు పట్టుకొని ఊరంతా ఎవరు ఊడువాలె.. చెప్పులు ఎవరు కుట్టాలె అన్న దగ్గరే ఇన్ని రోజులు మమ్ములను ఉంచారు తప్పించే మేం బాగుపడాలే అని ఏ నాయకుడూ ఆలోచించలేదు. ఇప్పుడు మమ్మల్ని పైకి తీసుకురావాలని ఆలోచన చేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. నాకు రాజకీయాలకంటే నా కులమే ముఖ్యం. పేద వర్గాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించడమే ముఖ్యం’ అని స్పష్టంచేశారు.
కాంగ్రెస్, బీజీపీ కుట్ర
దళితబంధుకు తూట్లు పొడిచేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ‘ఎందుకూ పనికి రానోళ్లు, చాతగానోళ్లు, అక్కరకురానోళ్లు.. వాళ్ల కొంప ఏం మునిగిందో.. వాళ్ల ముల్లె ఏం పోతుందో తెలియదుగానీ దళితులకు రూ.10 లక్షలు ఇస్తామంటే అడ్డం పడుతున్నరు. కాంగ్రెస్, బీజేపీలు రాజకీయంగా మనుగడ ఉండదని భయపడుతున్నాయి. ఇవ్వొద్దని చెప్పే ధైర్యం లేక ఆ స్కీమ్కు ఏ రకంగానైనా తూట్లు పొడిచేందుకు కుట్ర చేస్తున్నయ్. రేవంత్రెడ్డి ఓ శనిపాదం. ఆనాడు టీడీపీని నిలువునా ముంచిన వ్యక్తి. టీడీపీ రెండు రాష్ర్టాల్లో లేకుండా పోవడానికి కారణం అతనే. కాంగ్రెస్కు అదే గతి పట్టిస్త్తడు. రేవంత్రెడ్డి జీవితంలో ఎక్కడ చూసినా మోసమే. బ్లాక్మెయిల్ చేసే బతుకుతున్నడు. వందల కోట్లు ఇచ్చి పీసీసీ ఎలా తెచ్చుకున్నాడు. వ్యవస్థకు పట్టిన చీడ పురుగు రేవంత్రెడ్డి. జైలులో ఉండాల్సిన వ్యక్తి. బీజేపీ నేత బండిసంజయ్ పాదయాత్ర ఎవరి కోసం చేస్తున్నడు? ఆయన యాత్రతో తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు. దళిత బిడ్డలు కాంగ్రెస్, బీజీపీలను ఊళ్లకు రానివ్వకుండా తరిమి కొట్టాలె. అందుకోసమే ఈ దీక్ష. అంబేద్కర్ ఆశయ సాధన కోసం పని చేస్తున్న కేసీఆర్ కోసం దళితులంతా ఏకం కావాలె’ అని పిలుపునిచ్చారు. దళితుల భూములు లాక్కున్న ఈటల రాజేందర్ హుజూరాబాద్లో ఏం చేసినా గెలిచే పరిస్థితి లేదని స్పష్టంచేశారు. దీక్ష అనంతరం ఎస్పీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, ప్రజా సంఘాల జేఏసీ నాయకుడు గజ్జల కాంతం నిమ్మరసం ఇచ్చి మోత్కుపల్లితో దీక్ష విరమింపచేశారు.
దళితుల అభివృద్ధే కేసీఆర్ లక్ష్యం: పిడమర్తి రవి
సీఎం కేసీఆర్ పాలనలో దళితులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. మోత్కుపల్లిని కలిసి దీక్షకు సంఘీభావం తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు దళితులు ఇప్పుడు గుర్తుకొచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా దళితులు సమాజంలో ఉన్నారని, అప్పుడే వారి అభ్యున్నతికి ఎందుకు కృషి చే యలేదని నిలదీశారు. బీజేపీ నేత బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఎవరికోసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాపోలు రాములు, రంగారెడ్డి జిల్లా మాదిగ జేఏసీ చైర్మన్ నక్క శరత్కుమార్, ఎలిమినేటి ప్రశాంత్, రాజు, సాయి, సతీశ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.