ఆత్మకూర్(ఎస్), జూలై 14: ఆన్లైన్ గేమ్ యువకుడి ప్రాణాలను బలిగొన్నది. గేమ్లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. ఏపూరుకు చెందిన కాకి వెంకట్రెడ్డి, కవిత దంపతుల కుమారుడు మధురెడ్డి(20) బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ మధ్య మొబైల్లో ఆన్లైన్ గేమ్ ఆడుతున్నాడు. ఇటీవల తల్లి బ్యాంకు ఖాతా నుంచి రూ.1.20 లక్షలు కట్ కావడంతో ఆందోళన చెందాడు. వివరాలు తెలుసుకోవడానికి తల్లి బుధవారం బ్యాంకుకు వెళ్లింది. మరింత ఆందోళనకు గురైన మధురెడ్డి ఇంట్లో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై లింగం తెలిపారు.