హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): కిండర్ గార్డెన్సహా శిశు తరగతుల్లోని విద్యార్థులకు సైతం ఆన్లైన్ తరగతులు నిర్వహించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది మూడు, ఆపై తరగతుల విద్యార్థులకు మాత్రమే క్లాసులు నిర్వహించగా.. ఈ ఏడాది ప్రీస్కూళ్లు, ప్లేస్కూళ్ల విద్యార్థులకు సైతం నిర్వహించవచ్చని పేర్కొన్నది. ఈ నెల ఒకటి నుంచి రాష్ట్రంలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కాగా ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా సోమవారం విడుదలచేశారు. కేంద్రం జారీచేసిన ప్రగ్యాట (ఎనిమిది అంచెల) మార్గదర్శకాలను అనుసరించి ప్రీస్కూళ్లు, ప్లేస్కూళ్ల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని మార్గదర్శకాల్లో వెల్లడించారు. ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు గ్రామస్థాయిలో వెనుకబడిన ప్రాంతాలపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఆన్లైన్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారులంతా సమన్వయం చేయాలని పేర్కొన్నారు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యార్థుల నమోదును చేపట్టాలని మార్గదర్శకాల్లో సూచించారు.
ఇవీ మార్గదర్శకాలు..
ప్లేస్కూల్స్, ప్రీస్కూళ్ల విద్యార్థులకు రోజుకు 45 నిమిషాలపాటు క్లాసులు నిర్వహించాలి. వారం లో మూడు రోజులే బోధించాలి.
1 -5 తరగతులవారికి రోజుకు రెండు పీరియడ్లు. వారంలో ఐదు రోజులే. రోజుకు ఒకటిన్నర గంటలకు బోధన మించరాదు.
6- 8 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పీరియడ్లు బోధించాలి. వారంలో ఐదు రోజులే.
9 -10 తరగతులవారికి రోజుకు రెండు పీరియడ్లు. ఒక్కో పీరియ డ్ 30 -45 నిమిషాలే ఉండాలి.
నాలుగుస్థాయిల్లో నిర్వహిస్తున్న బ్రిడ్జికోర్సు తరగతులను ఈనెల 31 వరకు నిర్వహించాలి.