ఢాకా: భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనను ఆ దేశంలోని కొందరు వ్యతిరేకించారు. శుక్రవారం పలు చోట్ల జరిగిన నిరసనలు హింసకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో జరిగిన పోలీస్ కాల్పుల్లో నలుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. చిట్టగాంగ్లో మోదీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరసనకారులు స్థానిక పోలీస్ స్టేషన్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ షెల్స్, రబ్బర్ బులెట్లు ప్రయోగించినట్లు ఆ దేశ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు మరణించగా పలువురు గాయపడినట్లు చెప్పారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కూడా మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనలకు దిగారు. పోలీసులు లాఠీచార్జ్ చేయగా ఇద్దరు జర్నలిస్ట్లతోపాటు పదుల సంఖ్యలో నిరసనకారులు గాయపడినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.