హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) నుంచి బీసీ స్టడీ సర్కిళ్లు, స్టడీ సెంటర్ల ఉద్యోగార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ స్టడీ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నామని ఆదివారం ప్రకటించారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగార్థులకు శిక్షణతోపాటు స్పోకెన్ ఇంగ్లిష్, వ్యక్తిత్వవికాసంలో శిక్షణ ఇచ్చి ఆత్మైస్థెర్యా న్ని పెంపొందిస్తామని చెప్పారు. ఈ స్టడీసెంటర్లను నియోజకవర్గాల్లోని జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల ప్రాంగణాల్లో ఏర్పాటుచేస్తామని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష శిక్షణ సాధ్యంకాకపోతే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామని వివరించారు. ప్రతి సెంటర్లో డిజిటల్ స్టూడియోను ప్రారంభించి యూట్యూబ్లో ప్రసారమయ్యేలా ఏర్పాట్లుచేస్తున్నట్టు చె ప్పారు. స్టడీసర్కిళ్లల్లో ప్రవేశం పొందే విద్యార్థులకు గుర్తింపుకార్డుల ద్వారా డిజిటల్పాఠాల యాక్సెస్కు అవకాశం కల్పిస్తామని తెలిపారు. స్టడీసెంటర్ ప్రాంగణాల్లో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ నెలకొల్పుతామన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సిద్దిపేట, గద్వాలతోపాటు ఇటీవలే సిరిసిల్లలో స్టడీసెంటర్ ఏర్పాటుచేసినట్టు గుర్తుచేశారు. రాష్ట్రంలోని స్టడీసెంటర్లు, స్టడీ సర్కిళ్లల్లో ఇప్పటికే 15,214 మంది శిక్షణ పొందారని, 1,302 మంది వివిధ ఉద్యోగాలు సాధించారని వివరించారు.