హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాతీయల నిధుల ఖర్చులో పారదర్శకత, జవాబుదారీతనం మరింతగా పెంపొందించేందుకు ప్రతి గ్రామ పంచాయతీలో ఆన్లైన్ ఆడిటింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో 40% పంచాయతీల్లో రికార్డులను ఆన్లైన్ ద్వారా ఆడిట్చేసి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. దేశంలోనే మొదటిదైన ఈ ప్రయోగాన్ని కేంద్రప్రభుత్వం సైతం ప్రశంసించింది. దీంతో 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వంద శాతం గ్రామ పంచాయతీలలో అన్ని రికార్డులను ఆన్లైన్లో ఆడిట్ చేయనున్నారు. కనీసం 20% పంచాయతీలలో రికార్డులను ఆన్లైన్ ఆడిటింగ్ చేయాలని కేంద్రం 2019-20లో లక్ష్యంగా నిర్దేశించింది. తెలంగాణలో 40% పంచాయతీల్లో ఆడిటింగ్ నిర్వహించింది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకుగాను 5,174 పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిట్ చేశారు. తెలంగాణ అనుభవాలను దేశంలోని ఇతర రాష్ర్టాలకు వివరించడానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. తెలంగాణ ఆడిట్ అధికారులు కర్ణాటక, మహరాష్ట్ర అధికారులకు ఆన్లైన్ ఆడిట్పై శిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలో 2020-21 సంవత్సరానికి సంబంధించిన రికార్డులను.. కరోనా నియంత్రణలోకి వచ్చాక ఆడిట్చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లుచేస్తున్నారు.