న్యూస్ నెట్వర్క్ జూలై 18 (నమస్తే తెలంగాణ): వారం రోజులుగా ఉరకలెత్తిన గోదారమ్మ ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. వరదపోటుతో అతలాకుతలమైన జనజీవనం ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. గోదారి నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రాద్రి వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం అర్ధరాత్రి 11 గంటలకు 58.50 అడుగులకు చేరుకొన్నది. సోమవారం ఉదయం 8 గంటల కల్లా 56.60 అడుగుల దిగువకు వచ్చింది. నీటిమట్టం తొమ్మిది గంటల సమయానికి 56.40 అడుగులు కాగా, 10 గంటలకు మరో 10 ఇంచులు తగ్గి 56.30 అడుగులకు చేరింది. ఉదయం, మధ్యాహ్నం 12 గంటలకు 56.10 అడుగులకు తగ్గిన వరద నీటిమట్టం అప్పటినుంచి రాత్రి 7 గంటల వరకు ఒక ఇంచు తగ్గకుండా నిలకడగా ఉన్నది. రాత్రి 10 గంటల కల్లా 56.40 అడుగులకు చేరింది. క్రమక్రమంగా నీటిమట్టం పెరగవచ్చని అధికారులు అంచనా వేశారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ నేతృత్వంలో వరద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పలు పునరావాస కేంద్రాల్లోని బాధితులకు భరోసా కల్పించారు. బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించడంతో జిల్లా అధికారులు అర్హుల జాబితాను రూపొందించాలని ఆదేశించారు. వరద సహాయక చర్యల ప్రత్యేక అధికారులు శ్రీధర్, హనుమంతరావు, రజత్కుమార్ సైనీ ముంపు బాధితులను పలకరిస్తూ వారికి అండగా నిలిచారు.
పారిశుధ్య చర్యల నిర్వహణ
వరద ఉధృతి కొంత తగ్గిన ప్రాంతాల్లో పంచాయతీ, మున్సిపల్ అధికారులు పారిశుధ్య చర్యలు చేపట్టారు. భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్కు వెళ్లే ప్రధాన రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద కొంత తగ్గుముఖం పట్టడంతో గోదావరి వంతెనపై రాకపోకలను పునరుద్ధరించారు. వరద తాకిడి గ్రామాల్లో మిలిటరీ, ఎన్డీఆర్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.
పడవలో వెళ్లి వైద్య శిబిరం
ఇటీవల కురిసిన వర్షాలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. దాంతో సోమవారం వైద్య సిబ్బంది నాటు పడవలో వెళ్లి ఆ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. వెంచపల్లికి రాకపోకలు అన్నివైపులా స్తంభించాయి. రెండు రోజుల పాటు గ్రామంలోనే ఉండి వైద్యశిబిరం నిర్వహించనున్నట్టు మాధవి తెలిపారు.
వాగు దాటించి.. బాలింతకు వైద్యం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్అంద్గూడ పంచాయతీ పరిధిలోని మామిడిగూడకు చెందిన ఉయిక గాంధారికి పురిటి నొప్పులు తీవ్రకావడంతో తన ఇంట్లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకొన్న పిట్టబొంగురం పీహెచ్సీ వైద్య సిబ్బంది గ్రామానికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలింతకు రక్తం తక్కువగా ఉండటంతో గ్రామస్తుల సహకారంతో అతికష్టంగా వాగును దాటించారు. ఇంద్రవెల్లి పీహెచ్సీకి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.