కోల్కతా: ఈ నెల 12 నుంచి తాను అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలుపెడుతానని ఇవాళ బీజేపీలో చేరిన ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీలో మీరు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారన్న మీడియా ప్రశ్నకు ఆయన సినిమా స్టైల్లో సమాధానం చెప్పారు. తాను ఇప్పుడే రంగంలోకి దిగానని, బీజేపీలో తాను ఎలాంటి పాత్ర పోషిస్తాననేది ఫటాకేస్టో సినిమా సిరీస్ చూస్తే మీకే అర్థమవుతుందని మిథున్ చక్రవర్తి వ్యాఖ్యానించారు.
ఈ ఉదయం కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభా వేదికపై మిథున్ చక్రవర్తి కాషాయం కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత అక్కడి చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ప్రధాని వేదికపైకి రాగానే మిథున్ చక్రవర్తి ఆయనకు నమస్కరిస్తూ స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కూడా మిథున్ చక్రవర్తితో చేయి కలిపి అభినందనలు తెలిపారు.