హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు పచ్చలహారం తొడగాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరేందుకు అడుగుదూరమే మిగిలింది. ఏడేండ్లలోనే 230 కోట్ల మొక్కల లక్ష్యం కాగా, ఆరువిడతల్లో ఇప్పటికే 220.70 కోట్ల మొక్కలు నాటారు. ఇందుకోసం ఇప్పటివరకు ప్రభుత్వం రూ. 5,591 కోట్లు ఖర్చుచేసింది. 2021-22 సం వత్సరంలో 19.91 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఆ లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం రేపట్నుంచి ఏడోవిడత హరితహారానికి శ్రీకారం చుడుతున్న ది. దేశంలోనే అత్యధిక మొక్కలు నాటి న రా ష్ట్రంగా తెలంగాణ పార్లమెంట్ రికార్డుల్లో నిలిచింది. ఏ రాష్ట్రం కనుచూపు మేరలో లేదు. మహారాష్ట్రలో 30 కోట్ల మొక్కలు నాటినట్టు రికార్డులు చెప్తున్నాయి. బ్రెజిల్, చైనా తర్వాత మూడో అతిపెద్ద మానవప్రయత్నంగా తెలంగాణకు హరితహారం చరిత్రకెక్కుతున్నది.
2015లో మొక్కగా మొదలై..
తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 2,77,10, 412 ఎకరాలు. అందులో 66,64,159 ఎకరాల్లో అడవులున్నాయి. దేశంలో సగటు అటవీ విస్తీర్ణం 21.34 శాతం కాగా.. తెలంగాణలో 24.05గా ఉన్నది. అయినా అంతర్జాతీయస్థాయికి తగ్గట్టుగా భూభాగంలో 33 శాతం పచ్చదనం ఉండాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని 2015 జూన్లో ప్రారంభించి 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. అడవుల వెలుపల 130 కోట్లు, అడవుల్లో 100 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 14,926 నర్సరీలను ఏర్పాటుచేశారు. ఆరోవిడత వరకు 220.70 కోట్ల మొక్కలు నాటా రు. ఏడోవిడతలో భాగంగా జూలై ఒకటి నుం చి 19.91 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అన్ని రోడ్ల వెంట రహదారి వనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమల్లోకి వచ్చాక గ్రామాల్లో పచ్చదనం తొణికిసలాడుతున్నది.
గ్రీన్సిటీగా హైదరాబాద్
ప్రపంచంలోనే ఎక్కువ మొక్కలు నాటిన నగరంగా హైదరాబాద్ ప్రసిద్ధికెక్కింది. ప్ర పంచ ప్రతిష్ఠాత్మక సంస్థ ఆర్బర్డే ఫౌండేషన్తోపాటు ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్’ తెలంగాణ రాజధాని ని గ్రీన్సిటీ ఆఫ్ది వరల్డ్గా గుర్తించింది. గజ్వేల్ కోమటిబండ ప్రాంతంలో హరితహా రం ఫలాలు దేశానికే దిక్సూచిగా మారాయి. పలు రాష్ట్రప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని కేస్స్టడీగా తీసుకున్నాయి. రాష్ట్రప్రభుత్వం హరితహారం కోసం భారీగా ఖర్చుచేస్తూనే స్థానిక సంస్థల్లో గ్రీనరీ కోసం పదిశాతం నిధులను ప్రత్యేకంగా కేటాయించింది. ఈ నిధితో మున్సిపాలిటీలు, పంచాయతీలు పచ్చదనాన్ని పెంపొందిస్తున్నాయి.
రేపటి నుంచి పల్లెప్రగతి: మంత్రి ఎర్రబెల్లి
హన్మకొండ, జూన్ 29: నాలుగోవిడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని జూలై ఒకటి నుంచి పదో తేదీ వరకు నిర్వహించనున్నట్టు పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లె ప్రగతిని చాలెంజ్గా తీసుకొని గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. మంగళవారం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. గ్రామాభివృద్ధిలో నిర్లక్ష్యం వహించే సర్పంచ్లు, కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రోజువారీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించేందుకు గ్రామ సభ నిర్వహించాలని ఎర్రబెల్లి సూచించారు. సమావేశంలో చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.