ప్రజాప్రతినిధులు సైతం అప్రమత్తం
నిర్లక్ష్యం వీడి వేగంగా ‘పల్లె ప్రగతి’ పనులు
క్షేత్రస్థాయిలో లోపాల గుర్తింపు
పెరిగిన పర్యవేక్షణ.. వెనువెంటే చర్యలు
వరంగల్, మార్చి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :గ్రామాల సమగ్ర వికాసమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ని అమలు చేస్తున్నది. చాలా చోట్ల ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతూ మంచి ఫలితాలు సాధిస్తుంటే.. కొన్ని ఊర్లలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా సర్కారు సంకల్పం నీరుగారుతున్నది. కార్యక్రమం ద్వారా ఊరు సాధించిన ప్రగతిని విశ్లేషిస్తూ.. పనుల వెనుకబాటులో అలసత్వాన్ని ఎండగడుతూ ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. వీటిపై వెంటనే స్పందిస్తున్న అధికారులు ఆగమేఘాల మీద పల్లెల బాట పడుతున్నారు. ఎక్కడ పనులు పడకేశాయో ఆరాతీస్తూ పరిష్కారానికి వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఇటు ప్రజాప్రతినిధులు సైతం అప్రమత్తమవుతూ ఎప్పటికప్పుడు ‘ప్రగతి’ని పర్యవేక్షిస్తున్నారు.
ఏండ్ల నాటి దారిద్య్రాన్ని పోగొట్టి పల్లెలకు కొత్తరూపు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ని పకడ్బందీగా అమలు చేస్తున్నది. చాలా గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో ఈ కార్యక్రమం అద్భుత ఫలితాలు సాధిస్తున్నది. సర్కారు పక్కా ప్రణాళిక, సరిపడా నిధుల కేటాయింపుతో ఊర్లు కొత్తగా మారుతున్నాయి. పారిశుధ్యం, పచ్చదనం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ప్రకృతి వనాలతో పాటు మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగుతున్నది. మొత్తంగా పల్లెలు ఇప్పుడు నగరాలకు, పట్టణాలకు దీటుగా మారుతున్నాయి. మారుమూల పల్లెల్లోనూ శుద్ధమైన తాగునీరు, రోజంతా కరెంటు తదితర వసతులు అందుబాటులోకి వచ్చాయి. అందుకే సొంత ఊరిలోనూ తమకో ఇల్లుండాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో మొదలైంది.
వరుస కథనాలతో పరుగులు
ఈ క్రమంలో ప్రతి ఊరు పల్లె ప్రగతితో మెరుగుపడాలనే లక్ష్యంతో ‘పల్లె ప్రగతి’లో మంచీచెడులపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ప్రతి జిల్లాలోని ప్రతి ఊరును పరిశీలించి వ రుస కథనాలు అందిస్తోం ది. ఫిబ్రవరి 5న మొ దలైన ‘నమస్తే తెలంగాణ’ కథనాలతో అధికారులు, ప్రజాప్రతినిధుల్లో నిర్ల క్ష్యం వీడుతున్నది. ‘పల్లె ప్రగతి’ అమలులో విజయాలు, వైఫల్యాలపై దేనికదిగా రోజూ రెండు చొప్పున కథనాలు వస్తున్నాయి. పనితీరు సరిగ్గా లేని గ్రామాలపై కథనం వచ్చిన రోజే అధికార యంత్రాంగం స్పందిస్తున్నది. వెంటనే ఆ ఊరికి వెళ్లి పనుల నిర్లక్ష్యానికి కారణాలపై ఆరా తీస్తున్నది. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఏం చేయాలో స్థానిక అధికారులకు సూచిస్తున్నది. ప్రకృతి వనాలకు నీటి సరఫరా, వైకుంఠధామం నిర్మాణం కోసం భూమి గుర్తింపు వంటి సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్నాయి. ‘నమస్తే’ కథనాలతో ఎక్కువ మంది అధికారులు ముందుగానే చొరవ తీసుకుంటున్నారు. ప్రతి ఊరిలోనూ అన్ని వసతులు ఉండాలనే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పని చేస్తున్నారు. తమ పరిధిలోని గ్రామాలను పర్యవేక్షించి పెండింగ్ పనులను గుర్తిస్తూ వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
క్రమం తప్పకుండా నిధులు
రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ని 2019 సెప్టెంబరు 6 నుంచి అక్టోబరు 5 వరకు మొదటి విడుత, 2020 జనవరి 2 నుంచి 12 వరకు రెండో విడుత చేపట్టింది. తర్వాత ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పల్లె ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నది. 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం కలిపి గతేడాది ఏప్రిల్ నుంచి జనవరి వరకు ఆరు జిల్లాలకు కలిపి రూ.420.35 కోట్లు విడుదల చేసింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి 1,687 పంచాయతీలున్నాయి. గ్రామాల అవసరాలకు తగినట్లుగా పనుల ప్రణాళిక ఉంటున్నది. వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు అన్నిచోట్లా పూర్తవుతున్నాయి. చాలా గ్రామాల్లో ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పారిశుధ్యం, పచ్చదనం పెంచేందుకు అవసరమయ్యే ట్రాక్టర్లు ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని ఒక్క జీపీకి తప్ప అన్నింట్లోనూ ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లున్నాయి. వీటితో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సులభమవుతున్నది. మొక్కలకు నీటి సరఫరా నిరంతరాయం జరుగుతున్నది. పక్కా ప్రణాళిక, పర్యవేక్షణ, పారదర్శకత, అవసరమైన నిధుల కేటాయింపుతో ‘పల్లె ప్రగతి’ ఊర్లను సరికొత్తగా మారుతున్నది.
కొందరి తీరుతో పడకేస్తున్న పనులు
మెజార్టీ గ్రామాలు పల్లె ప్రగతిని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి బాట పడుతుంటే కొన్నిచోట్ల అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో పరిస్థితులు ఏమాత్రం మారడం లేదు. మంచినీటి పైపులైన్ల లీకేజీ, అస్తవ్యస్తంగా పారిశుధ్య నిర్వహణ, ఊరికి కచ్చితంగా కావాల్సిన వైకుంఠధామం, డంపింగ్ యార్డుల పనులు చేపట్టకపోవడం, ప్రకృతి వనాల్లో మొక్కల సంరక్షణను పట్టించుకోకపోవ డం లాంటి అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.