జనగామ : 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో ఆదివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో మిషన్ భగీరథ కార్యక్రమం క్రింద 830 కోట్ల రూపాయల వ్యయంతో 610 ఆవాసాలకు శుద్ధి చేసిన గోదావరి జలాలను అందిస్తున్నామని తెలిపారు.
దేశంలో వందశాతం ఆవాసాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన నీరు అందించిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. 50 వేల లోపు రుణ మాఫీలో భాగంగా జనగామ జిల్లాలో 37 కోట్ల 94 లక్షల రూపాయలు, 11 వేల 957 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 19 కోట్ల రూపాయల వ్యయంతో 2 వేల 570 రైతు కల్లాల నిర్మాణాన్ని, 13 కోట్ల 64 లక్షల రూపాయల వ్యయంతో 62 రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశామన్నారు.
జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం కింద 24 కోట్ల రూపాయల వ్యయంతో 483 ఆవాసాలలో పల్లె ప్రకృతి వనాలను, 35 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని గ్రామ పంచాయతీలలో వైకుంఠధామాల నిర్మాణాలను, 7 కోట్ల రూపాయల వ్యయంతో 281 డంపింగ్ యార్డుల నిర్మాణాని చేపట్టి పూర్తి చేశామని మంత్రి తెలిపారు.
జిల్లాలోని 12 మండల కేంద్రాలలో 4 కోట్ల 80 లక్షల రూపాయల వ్యయంతో త్వరలో బృహత్ పల్లె ప్రకృతి వనాల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అనంతరం వివిధ రంగాలలో అత్యంత ప్రతిభ కనపరచిన అధికారులకు, ఉద్యోగులకు ఆయన ప్రశంస పత్రాలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.